పశు పక్ష్యాదులను పెంచుకోవడం, వాటిని అపురూపంగా పెంచుకోవడం ఓ ఆనవాయితీ. వాటికి తగ్గ ఏర్పాట్లు చేసి, కన్నబిడ్డలా చూసుకునే వారూ వున్నారు. గయలో ఓ కుటుంబ ఓ చిలుకను ఇంతే అపురూపంగా పెంచుకుంటోంది. ఆ చిలుకతో వారి అనుబంధం విపరీతంగా పెరిగిపోయింది. అయితే.. కొన్ని రోజులుగా ఆ చిలుక కనబడటం లేదట. దీంతో వారు నానా హైరానా పడిపోతున్నారు.
తమ చిలుక కనిపించడం లేదని, గయాలోని చుట్టు పక్కల ప్రాంతాల్లో పోస్టర్లను కూడా అతికించేశారు. ఎవ్వరికీ కనబడ్డా, తమకు అప్పగించాలని విజ్ఞప్తుల మీద విజ్ఞప్తులు చేస్తున్నారు. అంతేకాకుండా క్యాష్ రివార్డు కూడా ప్రకటించడం గమనార్హం. తమ చిలుకను ఎవరైనా పట్టిస్తే 5,100 రూపాయలను బహుమానంగా ఇస్తామని ప్రకటించారు.
శ్యామ్ దేవ్ ప్రసాద్ గుప్తా, సంగీత గుప్తా అనే దంపతులు గయాలోని పిప్రపాటి ప్రాంతంలో వుంటున్నారు. వీరు పెంచుకున్న చిలుకే ఈ మధ్య ఇంట్లోని వెళ్లిపోయిందట. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో పోస్టర్లు వేయించారు. ఈ మధ్యే చిలుక వెళ్లిపోయిందని, తాము అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు. చెట్ల దగ్గరికి వెళ్లి, తాము రోజూ మాట్లాడుకునే భాషలో పిలుస్తున్నామని, అయినా అది దొరకడం లేదని వాపోయారు.
ఇక ఈ దంపతులు కేవలం పోస్టర్లకు మాత్రమే పరిమితం కాలేదు. తమ చిలుక తప్పిపోయిందని సోషల్ మీడియాలో కూడా తెగ ప్రచారం చేస్తున్నారు. 12 ఏళ్లుగా తాము దీనిని పెంచుకుంటున్నామని, ఓ రోజు హఠాత్తుగా ఇంట్లోంచి వెళ్లిపోయిందని పేర్కొన్నారు. ఎవరు తీసుకున్నారో.. దయచేసి తమకు ఇచ్చేయాలని ఆ దంపతులు విజ్ఞప్తులు చేస్తున్నారు.