న్యూఢిల్లీ: ప్రభుత్వం సరఫరా చేసే పదో తరగతి పాఠ్య పుస్తకాల్లో కొన్ని అధ్యాయాలను మార్చేశారు. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసర్చ్ అండ్ ట్రైనింగ్(NCERT) ఇవాళ ఓ ప్రకటన జారీ చేసింది. ఆవర్తన పట్టిక(Periodic Table), ప్రజాస్వామ్యం(Democracy) లాంటి చాప్టర్లను పదో తరగతి సిలబస్ నుంచి తీసివేస్తున్నట్లు ఎన్సీఈఆర్టీ పేర్కొన్నది. రేషనలైజేషన్లో భాగంగా విద్యార్థులపై వత్తిడిని తగ్గించే ఉద్దేశంతో ఆ సిలబస్ను తొలగిస్తున్నట్లు ఎన్సీఈఆర్టీ తెలిపింది.
ఇటీవల పదో తరగతి పాఠ్య పుస్తకాల నుంచి పరిణామ సిద్ధాంతాన్ని తొలగించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా రిలీజైన ఎన్సీఈఆర్టీ పుస్తకాల్లో మరిన్ని చాప్టర్లను తీసివేశారు. పీరియాడిక్ టేబుల్ గురించి కూడా చాప్టర్ను తీసివేసినట్లు తెలుస్తోంది. సైన్స్ పాఠ్య పుస్తకం నుంచి పర్యావరణ సమతుల్యత, ఇంధనం గురించి అధ్యాయాలను తొలగించారు. ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్య సవాళ్లు, రాజకీయ పార్టీలు లాంటి అధ్యాయాలను కొత్త బుక్స్ నుంచి పూర్తిగా తీసేశారు.