న్యూఢిల్లీ : జమ్ము కశ్మీర్లో ప్రస్తుత కూల్చివేతలను ఉద్దేశించి పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ కాషాయ సర్కార్పై విమర్శలు గుప్పించారు. కశ్మీర్లో కొనసాగుతున్న కూల్చివేతలను చూస్తే బీజేపీ ప్రభుత్వం ఈస్టిండియా కంపెనీని తలపిస్తోందని దుయ్యబట్టారు. కశ్మీర్ కంటే పాలస్తీనా పరిస్ధితి మెరుగ్గా ఉందని వ్యాఖ్యానించారు.
బీజేపీ తన మెజారిటీని ఉపయోగించుకుని దేశ రాజ్యాంగాన్ని బుల్డోజ్ చేస్తోందని మండిపడ్డారు. మీడియాను ఉపయోగించుకుని అసమ్మతితో పాటు న్యాయవ్యవస్ధ గొంతునూ నులుముతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కశ్మీర్లో బుల్డోజర్ను ఉపయోగించి కాషాయ పాలకులు చెలరేగుతుండటంతో ఈ ప్రాంతం ఆప్ఘనిస్తాన్ను మరిపించేలా ఉందని మెహబూబా ముఫ్తీ పేర్కొన్నారు. మన ఉద్యోగాలు, భూమి, ఖనిజ సంపదను బీజేపీ పాలకులు అవుట్సోర్సింగ్కు ఇచ్చారని విమర్శించారు.
దేశంలో జర్నలిస్టులు, రాజకీయనేతలపై ఈడీ, ఎన్ఐఏలను ప్రయోగిస్తున్నారని ఆరోపించారు. జమ్ము కశ్మీర్లో కొనసాగుతున్న ఆక్రమణల కూల్చివేతను ప్రస్తావిస్తూ ఈ డ్రైవ్ను అడ్డుపెట్టుకుని కశ్మీరీలను వారి భూముల నుంచి వెళ్లగొట్టి మోసగాళ్లకు 45,000 హెక్టార్ల భూమి ధారాదత్తం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. గతంలో ఇజ్రాయిల్ పాలస్తీనా విషయంలో ఏం చేసిందో బీజేపీ దాన్ని అనుసరిస్తోందని అనుకునేవారమని, కానీ ఇప్పుడు వారు దాన్ని వదిలేసి జమ్ము కశ్మీర్ను ఆప్ఘనిస్తాన్లా మార్చాలని కోరుకుంటున్నారని అన్నారు. పాలస్తీనా చాలా నయమని, కానీ ఇక్కడ మాత్రం ప్రజల ఇండ్లను బుల్డోజర్లతో కూల్చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.