భూ బదలాయింపునకు కేంద్రం అనుమతి
హర్షం వ్యక్తంచేసిన సింగరేణి యాజమాన్యం
హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): సింగరేణి సంస్థ ఇతర రాష్ర్టాల్లో చేపడుతున్న మొట్టమొదటి బొగ్గుగని ‘నైనీ’కి అడ్డంకులు తొలగుతున్నాయి. తాజాగా ఒడిశాలోని నైనీ బొగ్గు తవ్వకాలు జరిపే 783 హెక్టార్ల అటవీ భూమిని సింగరేణికి బదలాయించేందుకు కేంద్ర అటవీశాఖ అనుమతులు మంజూరుచేసింది. ఈ నెల 24న ఢిల్లీలో జరిగిన కేంద్ర ఫారెస్ట్ అడ్వైజరీ కమిటీ (ఎఫ్ఏసీ) ప్రత్యేక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది చివరి నాటికి ఒడిశాలోని నైనీ బ్లాక్ నుంచి బొగ్గు ఉత్పత్తికి మార్గం సుగమమైంది. ఒడిశాలో సింగరేణికి కేటాయించిన నైనీ బ్లాకుకు మొత్తం 912.7 హెక్టార్ల భూమిలో అత్యధికంగా 783 హెక్టార్లు అటవీ ప్రాంతం ఉన్నది. గని ప్రారంభించాలంటే ఈ భూమిని సింగరేణికి బదలాయించాలి. ఈ నేపథ్యంలోనే సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. కేంద్ర, రాష్ట్ర అటవీశాఖలను సంప్రదిస్తూ.. ప్రతిపాదనలు సమర్పించడంతో గడువులోగా అటవీ భూమి బదలాయింపునకు అనుమతులు వచ్చాయి. ఇక పర్యావరణ క్లియరెన్స్ లాంఛనం మాత్రమేనని అధికారులు చెప్తున్నారు. ఇందుకు కావాల్సిన అన్ని పత్రాలు, హామీలను సింగరేణి సంస్థ సమర్పించింది.
అనతికాలంలోనే అనుమతులు
ఒడిశాలోని నైనీ బ్లాక్కు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ ఇప్పటికే పూర్తయింది. సింగరేణి బొగ్గు తవ్వకానికి అక్కడి ప్రజలు, ప్రజాప్రతినిధులు సానుకూలత వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో గని నుంచి ఓవర్బర్డెన్ తొలగింపు, బొగ్గు తవ్వకాలు అక్టోబర్ నుంచి ప్రారంభించాలని ఒడిశాలోని సింగరేణి అధికారులను సీఎండీ శ్రీధర్ ఆదేశించారు.