● యాంటీ ఖలిస్థాన్ ర్యాలీ హింసాత్మకం
● రాళ్లు రువ్వుకొన్న రెండు వర్గాలు
● గాల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు
పటియాలా, ఏప్రిల్ 29: పంజాబ్లోని పటియాలాలో (Patiala) రెండు గ్రూపుల మధ్య తలెత్తిన ఘర్షణలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకొని, కత్తులు దూసుకోవడంతో ఆ ప్రాంతమంతా రణరంగాన్ని తలపించింది. ఈ ఘటనలో నలుగురు గాయపడ్డారు. ఉద్రిక్తతలను తగ్గించేందుకు పోలీసులు గాల్లో కాల్పులు జరిపారు. శివసేనకు చెందిన పంజాబ్ విభాగం పంజాబ్ శివసేన (బాల్ ఠాక్రే) కార్యనిర్వాహక అధ్యక్షుడు హరీశ్ సింగ్లా ఆధ్వర్యంలో శుక్రవారం కొందరు యాంటీ ఖలిస్థాన్ మార్చ్ను నిర్వహించారు. దీనికి వ్యతిరేకంగా కొందరు సిక్కులు, నిహాంగ్స్ మరో ర్యాలీ చేపట్టారు. నగరంలోని కాళీమాత ఆలయం వద్ద రెండు గ్రూపులు ఎదురెదురు పడటంతో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇరువర్గాలు రాళ్లు రువ్వుకొంటూ.. కత్తులు దూసుకొన్నాయి. దీంతో రంగప్రవేశం చేసిన పోలీసులు.. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు గాల్లో కాల్పులు జరిపారు.
ఘర్షణల్లో నలుగురికి గాయాలయ్యాయి. ఘర్షణల ప్రాంతంలో పెద్దయెత్తున బలగాలను మోహరించామని, ప్రస్తుతం నగరంలో పరిస్థితులు అదుపులోనే ఉన్నట్టు పటియాలా ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రాకేశ్ అగర్వాల్ తెలిపారు. ఘర్షణల నేపథ్యంలో శుక్రవారం రాత్రి 7 గంటల నుంచి శనివారం ఉదయం 6 గంటల వరకు జిల్లావ్యాప్తంగా కర్ఫ్యూ విధించారు. ఘటన నేపథ్యంలో హరీశ్ సింగ్లాను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు శివసేన ఒక ప్రకటనలో తెలిపింది. కాగా ఏప్రిల్ 29న ఫౌండేషన్ డే ఆఫ్ కలిస్థాన్ నిర్వహిస్తామని పంజాబ్లోని కొందరు సిక్కులు ప్రకటించడంతో దానికి వ్యతిరేకంగా ఈ ర్యాలీ చేపట్టినట్టు సింగ్లా పేర్కొన్నారు. ఘర్షణలపై వారంలోగా నివేదిక ఇవ్వాలని నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ పంజాబ్ ప్రభుత్వాన్ని కోరింది.