పట్నా : షారుక్ ఖాన్ నటించిన పఠాన్ మూవీ విడుదలకు ముందే ప్రకంపనలకు వేదికైంది. పఠాన్ సినిమాను అడ్డుకుంటామని హిందూ సంస్ధలు ప్రకటించగా బీహార్లోని భాగల్పూర్లో భజరంగ్ దళ్, ఏబీవీపీ కార్యకర్తలు మూవీని ప్రదర్శించే థియేటర్ వద్ద నిరసన చేపట్టారు. పఠాన్ పోస్టర్లను చించివేసి దగ్ధం చేశారు.
ఈ సినిమాను ప్రదర్శిస్తే థియేటర్ను దగ్ధం చేస్తామని వారు పెద్దపెట్టున నినాదాలు చేశారు. భాగల్పూర్లోని దీపప్రభ సినిమా హాల్ వద్ద నిరసనకారుల ఆందోళనతో ఉద్రిక్తత నెలకొంది. పఠాన్ మూవీని దేశవ్యాప్తంగా బహిస్కరిస్తామని, ఈ సినిమాలో కాషాయ రంగును, సనాతన ధర్మాన్ని అవమానించారని ఆందోళన వ్యక్తం చేశారు.
హిందుత్వ విషయంలో రాజీపడబోమని, సనాతన సంస్కృతిని వ్యతిరేకిస్తే సహించేది లేదని నినాదాలు చేశారు. భాగల్పూర్లో పఠాన్ మూవీని థియేటర్లలో ప్రదర్శిస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు. ఆందోళనకారులపై థియేటర్ మేనేజర్ లలన్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పఠాన్ ప్రదర్శనకు అవాంతరం లేకుండా తగిన భద్రత కల్పిస్తామని ఎస్పీ, స్ధానిక అధికారులు హామీ ఇచ్చారని సింగ్ తెలిపారు.