Parliament Security Breach | న్యూఢిల్లీ : నాలుగు అంచెల భద్రతా వలయాన్ని దాటుకొని లోక్సభలోకి ఇద్దరు దుండగులు ప్రవేశించడంతో దేశం ఉలిక్కిపడిన సంగతి తెలిసిందే. లోక్సభలో కలర్ స్మోక్ విడుదల చేసి ఎంపీలను ఆందోళనకు గురి చేశారు. సాగర్ శర్మ, మనోరంజన్ కలిసి ఈ ఘటనకు పాల్పడ్డారు. బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా పేరు మీద జారీ అయిన పాస్లతో ఈ ఆగంతకులు ఇద్దరూ లోక్సభలోకి ప్రవేశించినట్లు పోలీసుల విచారణలో స్పష్టమైంది.
ఈ పరిణామాల నేపథ్యంలో పార్లమెంట్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. అయితే విజిటర్స్ గ్యాలరీ వద్ద పోలీసులు నిఘా పెట్టాలని నిబంధనల్లో ఉంది. సందర్శకులు అల్లరి చేయకుండా చూడడం కూడా అక్కడున్న భద్రతా సిబ్బంది బాధ్యత. నినాదాలు చేయడం, కరపత్రాలు విసిరేడయం వంటి చర్యలను అరికట్టాల్సిన బాధ్యత కూడా భద్రతా సిబ్బందిదే. అయితే ప్రస్తుతం విజిటర్స్ పాసులను నిషేధించారు. ఎంపీలను, అధికారులను, ఇతర సిబ్బందిని, జర్నలిస్టులను వేర్వేరు గేట్ల ద్వారా పార్లమెంట్ భవనంలోకి పంపించాలని పోలీసులు నిర్ణయించారు. అయితే లోక్సభలోకి విజిటర్స్ ఎలా ప్రవేశిస్తారు..? పాసులు ఎలా పొందాల్సి ఉంటుంది..? అసలు లోక్సభ హ్యాండ్ బుక్ ఏం చెబుతుందో తెలుసుకుందాం.
-సెంట్రలైజ్డ్ పాస్ ఇష్యూ సెల్(CPIC)లో ఎల్లో కలర్లో అప్లికేషన్ ఉంటుంది. ఆ అప్లికేషన్ను నింపిన తర్వాత సందర్శనకు ఒక రోజు ముందు మాత్రమే సందర్శకులకు పాసులు జారీ చేయాల్సి ఉంటుందని హ్యాండ్బుక్లో పేర్కొనడం జరిగింది.
-ఆ దరఖాస్తుల్లో ఎంపీలు తప్పనిసరిగా, విజిటర్ పూర్తి పేరు, తండ్రి లేదా భర్త పేరు, వయసు, జాతీయత, పాస్ పోర్టు నంబర్(విదేశీయులు అయితే), వృత్తి వంటి వివరాలతో పాటు ప్రజెంట్, పర్మినెంట్ అడ్రస్లను రాయాలి.
-ఈ సందర్శకుడు మా బంధువు లేదా పర్సనల్ ఫ్రెండ్ లేదా తెలిసిన వ్యక్తి.. అతను ఎలాంటి ఉల్లంఘనకు పాల్పడినా బాధ్యత తనదే అని ఎంపీ ఒక సర్టిఫికెట్ జారీ చేయాల్సి ఉంటుంది.
-ఒక విజిటర్ పాసుపై నలుగురికి మాత్రమే ప్రవేశం ఉంటుంది. పార్లమెంట్ సందర్శనకు ఒక రోజు ముందు అంటే సాయంత్రం 4 గంటల లోపు ఆ దరఖాస్తును సెంట్రలైజ్డ్ పాస్ ఇష్యూ సెల్లో సమర్పించాల్సి ఉంటుంది.
-ఆ దరఖాస్తులను నిశితంగా పరిశీలించిన తర్వాతే పాసులను జారీ చేస్తారు.
-ఏ ఎంపీ అయితే పాసులు ఇవ్వాలని సిఫారసు లేఖలు జారీ చేస్తారో.. వారిని సంప్రదించిన తర్వాత అదే రోజు పాసులను జారీ చేసే అవకాశం ఉంటుంది.