అహ్మదాబాద్ : గుజరాత్ తీరంలో ఆదివారం భారత జాలర్ల పడవపై పాక్ నేవీ కాల్పులకు తెగబడింది. బుల్లెట్ గాయాలకు ఓ మత్స్యకారుడు మృతి చెందగా.. మరో మత్స్యకారుడు గాయపడ్డాడు. మృతుడిని శ్రీధర్గా గుర్తించారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని.. పోస్టుమార్టానికి తరలించారు. గాయపడ్డ వ్యకిని ద్వారకలోని ఆసుప్రతికి చేర్పించగా.. చికిత్స పొందుతున్నాడు. పాక్ ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడం ఇదే తొలిసారి కాదు. ఇంతకు ముందు పాక్ చాలా మంది జాలర్లను అరెస్టు చేసింది.
గతేడాది ఏప్రిల్లో పాక్ నేవీ రెండు పడవలపై కాల్పులు జరిపింది. ఆ సమయంలో బోట్లలో ఎనిమిది మంది ఉండగా.. యూపీకి చెందిన ఓ వ్యక్తి గాయపడ్డాడు. మార్చిలో 11 మంది భారత జాలర్లను అరెస్టు చేశారు. అంతకు ముందు మార్చిలోనూ పాక్ మరో 11 మంది మత్స్యకారులను అరెస్టు చేసి, రెండు బోట్లను సీజ్ చేసింది. ఫిబ్రవరిలో కూడా పాక్ జలాల్లోకి ప్రవేశించినందుకు 17 మంది జాలర్లను అరెస్టు చేసి, మూడు పడవలను స్వాధీనం చేసుకున్నది.