న్యూఢిల్లీ: భారత్, పాకిస్థాన్ సరిహద్దు సమీపంలో రెండు ఎయిర్బేస్లను పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ (పీఏఎఫ్) పునరుద్ధరించింది. నియంత్రణ రేఖ (ఎల్వోసీ) సమీపంలోని ఉన్న ఈ రెండు ఎయిర్బేస్లు శ్రీనగర్కు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. పాక్ ఆక్రమిక కశ్మీర్(పీవోకే)లోని కోట్లి, రావల్కోట్లో ఉన్న ఈ ఎయిర్బేస్లను కొన్నేండ్ల కిందట మూసివేశారు. కాగా, 2019 ఫిబ్రవరి 26న పీవోకేలోని బాలకోట్లో ఉగ్రవాదుల స్థావరాలపై భారత వైమానిక దళం (ఐఏఎఫ్) మెరుపు దాడి చేసింది. అనంతర పరిణామాల నేపథ్యంలో పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతంలో చాలా కాలంగా వినియోగంలో లేని రెండు ఎయిర్బేస్లను పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ తిరిగి తెరిచినట్లు సమాచారం.
పాకిస్థాన్ ఆర్మీ 23 డివిజన్లో భాగమైన 3 POK బ్రిగేడ్ ప్రాంతంలో కోట్లీ ఎయిర్ బేస్ ఉన్నది. ఇటీవల వందకు పైగా వాయు రక్షణ దళాలను ఇక్కడకు తరలించారు. మరోవైపు రావల్కోట్ ఎయిర్ బేస్, పాక్ ఆర్మీ 12 డివిజన్కు చెందిన 2 POK బ్రిగేడ్ కిందకు వస్తుంది. నాలుగేళ్ల కిందట మూసివేసిన ఈ ఎయిర్ బేస్ను పీఏఎఫ్ తిరిగి తెరిచింది. ఎఫ్-16 యుద్ధ విమానాలను స్వల్ప సంఖ్యలో మోహరించింది.
మరోవైపు బలూచిస్థాన్లోని షమ్సీ ఎయిర్ బేస్ను పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ (పీఏఎఫ్) బలోపేతం చేస్తున్నది. సింధులోని జాకబాబాద్ పీఏఎఫ్ స్థావరం సమీపంలో కొత్త సైనిక కంటోన్మెంట్ని నిర్మిస్తున్నారు. కాగా, ఈ చర్యలు ఈ ప్రాంతంలో అశాంతిని రాజేయడంతోపాటు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింతగా పెంచవచ్చని అంచనా వేస్తున్నారు.