న్యూఢిల్లీ, అక్టోబర్ 15: అఫ్ఘానిస్థాన్లోని తాలిబన్ ప్రభుత్వానికి, పాకిస్థాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు పెరిగాయి. సరిహద్దుల్లో ఇరుదేశాల బలగాల మధ్య బుధవారం భీకర ఘర్షణలు చోటుచేసుకున్నాయి. తెల్లవారుజామున జరిగిన కాల్పుల పోరులో డజన్ల సంఖ్యలో మరణాలు చోటుచేసుకోగా పలువురు గాయపడ్డారు. తాలిబన్ సైనిక స్థావరాలపై దాడి చేసేందుకు పాక్ సైన్యం ఉపయోగించిన యుద్ధ ట్యాంకును స్వాధీనం చేసుకున్న అఫ్ఘాన్ సైన్యం పాక్ సైనిక ఔట్పోస్టుపై దాడి చేసినటు ్ల వార్తలు వచ్చాయి. పాకిస్థాన్లోని చమన్ జిల్లా, అఫ్ఘాన్లోని బోల్దక్ జిల్లాలో ఉభయ దేశాలకు చెందిన సైనిక దళాలు పరస్పరం దాడులకు తెగపడ్డాయి.
మంగళవారం అర్ధరాత్రి నుంచి జరుగుతున్న కాల్పులలో 58 మంది పాక్ సైనికులు మరణించినట్లు అఫ్గాన్ వెల్లడించగా పాక్ మాత్రం 200 మందికిపైగా అఫ్ఘాన్ సైనికులు మరణించారని, తమ సైనికులు 23 మంది మరణించారని తెలిపింది. అఫ్ఘాన్లోని కాందహార్ ప్రావిన్సు, పాక్లోని బలోచిస్థాన్ ప్రాంతం మధ్య ఉన్న కీలక సరిహద్దు జిల్లా స్పిన్ బోల్దక్లో పాక్ సైన్యం జరిపిన దాడులలో 12 మంది మరణించగా 100 మందికిపైగా గాయపడ్డారని అఫ్ఘాన్కు చెందిన తాలిబన్ తెలిపింది. కాగా, కాబుల్లోని తెహ్రీక్-ఎ-తాలిబన్ పాకిస్థాన్(టీటీపీ) శిబిరాలపై పాక్ గత వారం దాడులు చేయడంతో రెండు దేశాల మధ్య ఘర్షణలు మొదలయ్యాయి. తాలిబన్ విదేశాంగ మంత్రి భారత్ను తొలిసారి సందర్శించి భారత్తో దౌత్య సంబంధాలను పునరుద్ధరించుకున్న తరుణంలో అఫ్ఘాన్పై పాక్ దాడులు జరపడం గమనార్హం
అఫ్ఘాన్, పాకిస్థాన్ మధ్య ఘర్షణలకు తాత్కాలికంగా తెరపడింది. 48 గంటల పాటు కాల్పుల విరమణ పాటించాలని రెండు దేశాలు నిర్ణయించాయి. తాజా ఘర్షణలతో రెండు దేశాల సరిహద్దుల వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకోవడంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు పాక్ చర్చల ప్రక్రియ కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందుకు తాత్కాలికంగా 48 గంటల కాల్పుల విరమణ ఒప్పందాన్ని చేసుకున్నట్లు పాకిస్థాన్ విదేశాంగ శాఖ ప్రకటించింది.
ఒకనాటి మిత్రులైన పాక్, అఫ్ఘాన్ మధ్య ఘర్షణలు తీవ్రరూపం దాల్చడం, చర్చల కోసం పాక్ మంత్రులు తమ దేశంలోకి ప్రవేశించడానికి అఫ్ఘాన్ అనుమతించకపోవడంతో మధ్యవర్తిత్వం వహించాలని పాక్ ప్రభుత్వం ఖతార్, సౌదీ అరేబియాకు అంతకుముందు విజ్ఞప్తి చేసింది.