(స్పెషల్ టాస్క్ బ్యూరో)
హైదరాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2023-24 ఆర్థికసంవత్సరపు బడ్జెట్ మొత్తం కోతల మయమేనని తేలింది. ఆకలి, ఉపాధి సూచీలో దేశం అట్టడుగు స్థానంలో ఉన్న నిజాన్ని విస్మరించి ఆహార సబ్సిడీ, ఉపాధి హామీ పథకాల నిధులకు ప్రభుత్వం కోత విధించింది. అంతేనా, సాగు, ఎరువుల సబ్సిడీ, ధాన్యం సేకరణ ఇలా అన్ని పథకాల్లోనూ కోతలే ప్రధానంగా కనిపించాయి. ఇండ్ల నిర్మాణం, విద్య, వైద్యం తదితర రంగాలకు కూడా పెరుగుతున్న ద్రవ్యోల్భణంతో పోల్చుకున్నప్పుడు అరకొర కేటాయింపులే దక్కాయి.
కోతలు ఇలా..
ఉపాధి హామీ: 2022-23 ఆర్థిక సంవత్సరంలో 89,400 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు సవరించిన అంచనాల్లో చూపించారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి 60,000 కోట్ల రూపాయలను ఈ పథకానికి కేటాయించారు.
ఆహార సబ్సిడీ: 2022-23లో 2,87,194 కోట్ల రూపాయలను ఖర్చు చేయగా, ప్రస్తుతం 1,97,350 కోట్ల రూపాయలను కేటాయించారు.
ధాన్యం సేకరణ: ధాన్యం సేకరణ కోసం ఎఫ్సీఐకి 2022-23లో రూ.2,14,696 కోట్ల సబ్సిడీ ఇవ్వగా.. ప్రస్తుత బడ్జెట్లో ఈ నిధులను 1,37, 207 కోట్లకు తగ్గించారు. ఎన్ఎఫ్ఎస్ఎ పథకం కింద చేసే సేకరణకు గత బడ్జెట్లో రూ.72,283 కోట్లు ఇవ్వగా, తాజా బడ్జెట్లో 59,793 కోట్లకు సరిపెట్టారు.
వ్యవసాయం: 2022-23 బడ్జెట్లో 1,51,521 కోట్ల రూపాయలను వ్యవసాయరంగానికి కేటాయించగా, 2023-24 ఆర్థిక సంవత్సరానికి 1,44,224 కోట్ల రూపాయలను విదిలించారు.
ఎరువులు: 2022-23లో 2,25,520 కోట్ల రూపాయలను ఎరువుల సబ్సిడీ కోసం ఖర్చు చేయగా, తాజా బడ్జెట్లో రూ.1,75,100 కోట్లతో సరిపెట్టారు.
గ్రామీణాభివృద్ధి: గత ఏడాది సవరించిన అంచనాల ప్రకారం బడ్జెట్లో రూ.2.43 లక్షల కోట్లుగా పేర్కొంది. ప్రస్తుత బడ్జెట్లో రూ. 2,38,204 కోట్లు కేటాయించింది.
పీఎం పోషణ్: సర్కారు బడుల్లో పేద విద్యార్థులకు కడుపు నింపుతున్న మధ్యాహ్న భోజన పథకం (పీఎం పోషణ్)కు గత ఏడాది కేటాయింపుల్లో సవరించిన అంచనాలు రూ.12,800 కోట్లుగా పేర్కొన్నప్పటికీ ప్రస్తుత బడ్జెట్లో 11,600 కోట్లు కేటాయించారు.
పీఎం కిసాన్: చిన్న, సన్నకారు రైతుల ఆదాయం పెంపుకోసం 2018 నుంచి అమలు చేస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి రూ.8 వేల కోట్లు కోత విధించారు.
ఆహార, పౌర సరఫరాల శాఖ: ఆహార, పౌర సరఫరాల శాఖ బడ్జెట్లో కేంద్రం 30 శాతం కోత విధించింది. ప్రస్తుత బడ్జెట్లో ఈ శాఖకు రూ.2,06,513 కోట్లు కేటాయించింది. ఇది గత ఏడాది సవరించిన బడ్జెట్ అంచనాలు రూ.2,96,303 కోట్లుగా ఉన్నాయి.