న్యూఢిల్లీ: పద్మశ్రీ గ్రహీత, మేటి చెఫ్ ఇంతియాజ్ ఖురేషి(Chef Imtiaz Qureshi) కన్నుమూశారు. ఆయన వయసు 93 ఏళ్లు. ఐటీసీ హోటల్స్ ఏర్పాటులో ఆయన కీలకపాత్ర పోషించారు. ఇంతియాజ్ ఖురేషి మృతి గురించి ప్రఖ్యాత చెఫ్ కునాల్ కపూర్ తన ఎక్స్ అకౌంట్లో ట్వీట్ చేశారు. ఎన్నో అద్భుతమైన వంటకాలను చెఫ్ ఇంతియాజ్ పరిచయం చేశారని, ఆయన వారసత్వాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటామన్నారు.
ఫిబ్రవరి 2, 1931లో ఆయన లక్నోలో జన్మించారు. దమ్ పుక్త్, బుఖారా లాంటి వంటకాలను ఆయన క్రియేట్ చేశారు. భారతీయ వంటకాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చేలా చేశారు. 1962లో సైనో ఇండియన్ వార్లో భారతీయ ఆర్మీకి కేటరింగ్ చేశారు 1979లో ఆయన ఐటీసీ హోటల్స్లో చేరారు. అక్కడ ఎన్నో రకాల వినూత్న వంటకాలతో ప్రత్యేక పేరును సంపాదించుకున్నారు.
ప్రధానులు, రాష్ట్రపతిలు ఇచ్చే విందులకు ఆయన వంటలు చేసేవారు. 2016లో కేంద్ర ప్రభుత్వం చెఫ్ ఇంతియాజ్కు పద్మశ్రీ అవార్డును బహూకరించింది.