చండీగఢ్: క్యాన్సర్ బారిన పడి చివరి దశలో ఉన్న తన భార్య ఆయుర్వేద పద్ధతులు, ఆ ఆహారం ద్వారా దాని నుంచి కోలుకున్నదని కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ (Navjot Singh Sidhu) ఇటీవల వాదించారు. నవంబర్ 21 న బహిరంగ మీడియా సమావేశం ద్వారా ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలో సిద్ధూ భార్య నవజ్యోత్ కౌర్కు 850 కోట్ల మేర లీగల్ నోటీసు అందింది. ఛత్తీస్గఢ్ సివిల్ సొసైటీ (సీసీఎస్) ఈ నోటీసు జారీ చేసింది. ఆమె క్యాన్సర్ రికవరీ డైట్ గురించి సిద్ధూ చేసిన వాదనలపై వివరణ కోరింది.
కాగా, ఈ సందర్భంగా నవజ్యోత్ కౌర్కు సీసీఎస్ కొన్ని ప్రశ్నలు సంధించింది. మీ ఆరోగ్యం, క్యాన్సర్ నుంచి కోలుకోవడం గురించి మీ భర్త (సిద్ధూ) వాదనలకు మీరు మద్దతు ఇస్తున్నారా? మీ చికిత్స కోసం మీరు తీసుకున్న అల్లోపతి మందులు ప్రభావం చూపలేదని మీరు నమ్ముతున్నారా? మీరు కోలుకోవడానికి వేప ఆకులు, నిమ్మరసం, తులసి, పసుపు వంటి ఆహారాన్ని మాత్రమే తీసుకున్నారా? లేదా మీరు అల్లోపతి మందులను కూడా వాడారా? అని ప్రశ్నించింది.
మరోవైపు క్యాన్సర్ రోగులు చికిత్సను వదిలేసేలా, మధ్యలోనే మందులు మానివేసేలా సిద్ధూ వాదనలు ప్రభావితం చేస్తున్నాయని ఛత్తీస్గఢ్ సివిల్ సొసైటీ (సీసీఎస్) ఆరోపించింది. క్యాన్సర్ రోగుల జీవితానికి ఇది ప్రమాదం పెంచిందని విమర్శించింది. ఈ నేపథ్యంలో సిద్ధూ వాదనలకు మద్దతు ఇచ్చే సాక్ష్యాలను ఏడు రోజుల్లోగా సమర్పించాలని ఆ సంస్థ డిమాండ్ చేసింది. లేని పక్షంలో ప్రజలను ‘తప్పుదోవ పట్టించే’ వాదనలకు పరిహారంగా రూ.850 కోట్లు చెల్లించాలని సిద్ధూ భార్య కౌర్ను ఆ నోటీస్ ద్వారా కోరింది.