న్యూఢిల్లీ : స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ భారీ కుట్రను ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు. ఢిల్లీలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రి రవాణా చేస్తున్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఆనంద్ విహార్లో అరెస్టు చేసిన వారి నుంచి 2,251 తూటాలను స్వాధీనం చేసుకున్నారు. పంద్రాగస్టు వేడుకల నేపథ్యంలో ఢిల్లీలో పోలీసుల భద్రత కట్టుదిట్టం చేశారు. తనిఖీల సమయంలో అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
ఈ సందర్భంగా అసిస్టెంట్ పోలీసు కమిషనర్ విక్రంజిత్ సింగ్ మాట్లాడుతూ.. ఆ ఆరుగురు వ్యక్తులు ఈ తూటాలను ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోకు తరలించేందుకు ప్లాన్ చేసినట్లు తేలిందన్నారు. ఈ కుట్రలో ఉగ్రవాదుల ప్రమేయం ఉండొచ్చని పేర్కొన్నారు. ఆ కోణంలో కూడా విచారణ కొనసాగుతోందన్నారు. ఆరుగురిలో ఒకరు డెహ్రాడూన్కు చెందిన వ్యక్తి అని, అతను గన్ హౌజ్కు ఓనర్ అని తెలిపారు.
భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో ఢిల్లీలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఢిల్లీలో ఎక్కడికక్కడ చెక్పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీలోని మెట్రో స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలతో పాటు మార్కెట్ల వద్ద పోలీసులు నిఘా ఉంచారు. హోటల్స్, రెస్టారెంట్లను నిరంతరాయంగా పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. పంద్రాగస్టు వేడుకల నేపథ్యంలో ఢిల్లీలో 10 వేల మందికి పైగా పోలీసులను మోహరించారు. వీరంతా రెడ్ఫోర్టుకు వచ్చే దారులపై నిఘా పెట్టి, బందోబస్తు నిర్వహిస్తున్నారు.