న్యూఢిల్లీ : రాజ్యసభలో తనపై ప్రతిపక్ష ఎంపీలు ప్రవేశపెట్టిన ప్రవిలేజ్ మోషన్పై బుధవారం భారత సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, రాజ్యసభ సభ్యుడు రంజన్ గొగోయ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టం తనపని తాను చేసుకుంటుందన్నారు. సభా కార్యక్రమాలకు హాజరైన సందర్భంగా.. ప్రివిలేజ్ మోషన్ గురించి ప్రశ్నించగా ఈ విధంగా స్పందించారు.
సోమవారం ఇద్దరు టీఎంసీ ఎంపీలు జవహర్ సిర్కార్, మౌసమ్ నూర్ పార్లమెంట్కు హాజరుకాకపోవడంపై మాజీ సీజేఐ చేసిన వ్యాఖ్యలపై ప్రివేజ్ మోషన్ కోసం నోటీసును రాజ్యసభకు అందించారు. అయితే, నోటీసును రాజ్యసభ సెక్రటేరియట్ ఇంకా అంగీకరించలేదు. వీరితో పాటు పలు ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు సైతం నోటీసులు సమర్పించారు. ఇందులో శివసేన, సమాజ్వాదీ పార్టీ, ముస్లిం లీగ్, సీపీఐ (ఎం) ఎంపీలున్నారు.
ఇటీవల ఓ న్యూస్ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రంజన్ గొగోయ్ తనకు నచ్చినప్పుడే రాజ్యసభ సమావేశాలకు హాజరవుతానని, పార్టీ విప్లతో తనకు సంబంధం లేదని పేర్కొన్నారు. దీనిపై సోమవారం పార్లమెంట్లో టీఎంసీ ప్రివిలేష్ మోషన్ ప్రవేశపెట్టింది. గోగోయ్ చేసిన వ్యాఖ్యలు రాజ్యసభ ధిక్కారంగా ఉన్నాయని, సభా గౌరవానికి ఆయన మాటలు భంగం కలిగిస్తున్నాయని, ప్రత్యేక అధికారాలపై కూడా ఇవి ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయని తృణముల్ కాంగ్రెస్ పార్లమెంట్కు సమర్పించిన నోటీసులో పేర్కొంది.
కాగా, గతేడాది రాజ్యసభకు నామినేట్ అయిన గొగొయ్.. సమావేశాల హాజరు పదిశాతం లోపే ఉన్నది. ఇటీవల ప్రారంభమైన సమావేశాలకు దూరంగా ఉండడంతో విమర్శలు ఎదుర్కొంటున్నారు. రంజన్ గొగోయ్ 2018 – 2019 మధ్య 13 నెలల పాటు భారత 46వ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. మార్చి 16, 2020న రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఆయనను రాజ్యసభకు నామినేట్ చేశారు.