Odisha Train Accident | రైళ్లకు ‘కవచ్’ కవచంలా పనిచేస్తుందన్నారు.. దాన్ని ప్రారంభిస్తూ చప్పట్లు కొట్టారు.. ఇక రైలు ప్రమాదాలే జరగవన్నారు.. కానీ, ఒడిశాలో శుక్రవారం జరిగిన రైళ్ల ప్రమాద ఘటనతో యావత్తు దేశం ఉలిక్కిపడింది. 21వ శతాబ్దంలో మహా విషాద ఘటనగా పేర్కొనేంత ఘోరం జరిగింది. ఈ ప్రమాదంలో ఏకంగా 288 మంది దుర్మరణం చెందారు. నిద్రలో ఉన్న వారు నిద్రలోనే తిరిగిరానిలోకాలకు వెళ్లిపోయారు. దాదాపు 900 మంది తీవ్రంగా గాయపడి దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇన్ని రోజులు గొప్పగా చెప్పిన కవచ్ ఏమైంది? మరి ఈ దుర్ఘటనకు బాధ్యులెవరు? ఈ పాపం ఎవరిది? అని అన్ని వర్గాల ప్రజలు ప్రశ్నలు సంధిస్తున్నారు.
భువనేశ్వర్, జూన్ 3: ‘కవచ్’ వ్యవస్థ ఉంటే కచ్చితంగా ఈ ఘోర రైలు ప్రమాదం జరిగి ఉండేది కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేశ రైల్వే చరిత్రలోనే గొప్ప టెక్నాలజీ అయిన ‘కవచ్’ను తామే అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ఘనంగా చెప్పుకున్నది. అయితే, మాటలు గొప్పగా చెప్పుకున్నా ఈ సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావడంలో మాత్రం కేంద్రం చిత్తశుద్ధి చూపించడం లేదు.
సిగ్నలింగ్ లోపాలు తలెత్తినా, మానవ తప్పిదాలు జరిగినా రైళ్లు ఒకదానిని మరొకటి ఢీకొట్టకుండా ‘కవచ్’ కాపాడుతుంది. దీనిని ఆర్డీఎస్వో అభివృద్ధి చేసింది. నిజానికి 2012లోనే ట్రైన్ కొలైజన్ అవాయిడెన్స్ సిస్టమ్ పేరుతో ఈ టెక్నాలజీని అభివృద్ధి చేయడం ప్రారంభమైంది. 2019లో బీజేపీ ప్రభుత్వం దీనికి ‘కవచ్’గా పేరు పెట్టింది. ఇప్పటికి 1,455 కిలోమీటర్ల మార్గంలో, 134 రైల్వే స్టేషన్ల పరిధిలో, 77 రైళ్లలో మాత్రమే ‘కవచ్’ను ఏర్పాటు చేశారు. అంటే మొత్తం రైల్వే లైనులో ఈ వ్యవస్థ అందుబాటులో ఉన్నది కేవలం 2 శాతం లైన్లలో మాత్రమే. ఒక కిలోమీటరు మార్గంలో ‘కవచ్’ వ్యవస్థ ఏర్పాటుకు దాదాపుగా రూ.54 లక్షలు ఖర్చవుతున్నదని అంచనా. గత బడ్జెట్లో కేంద్రం ‘కవచ్’కు కేవలం రూ.2,000 కోట్లు మాత్రమే కేటాయించింది. ఈ నిధులు 3,703 కిలోమీటర్లకు మాత్రమే సరిపోతాయి. ఈ లెక్కన దేశంలోని మొత్తం రైలు మార్గంలో ‘కవచ్’ వ్యవస్థను అందుబాటులోకి తేవడానికి మరో 20 ఏైండ్లెనా పట్టవచ్చు.
రైళ్లు, సిగ్నలింగ్ వ్యవస్థ, రైల్వే పట్టాల్లో రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ పరికరాలను అమరుస్తారు. ఎప్పుడైనా ఒకే ట్రాక్లో రెండు రైళ్లు ప్రయాణిస్తున్నట్టయితే దగ్గరకు చేరుకునే లోపే లోకోపైలట్ ప్రమేయం లేకుండానే బ్రేకులు పడి రైళ్లు ఆగిపోతాయి. లోకోపైలట్ సిగ్నల్ జంప్ చేసినా ‘కవచ్’ వ్యవస్థ దానికదే బ్రేకులు పడేలా చేస్తుంది.