సంకల్ప్ చింతన్ శిబిర్ వేదికగా కాంగ్రెస్ మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. ఇకపై… రాజ్యసభకు ఎవర్నైనా రెండు టర్మ్లు మాత్రమే నామినేట్ చేయాలన్న ప్రతిపాదనలు తీసుకురానుంది. ఎంతటి కీలక వ్యక్తి అయినా సరే.. రెండు టర్ముల తర్వాత ఇక రాజ్యసభకు నామినేట్ చేయకూడదని దాదాపుగా ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈ మేరకు సంస్థాగత వ్యవహారాల ప్యానల్ కసరత్తు ప్రారంభించింది.
ఈ విషయంపై సీడబ్ల్యూసీ సభ్యుడొకరు మాట్లాడుతూ… ఈ విషయం మా ప్యానల్ చర్చకు వచ్చింది. ఇప్పటి నుంచి రెండు సార్లు మాత్రమే ఓ వ్యక్తిని రాజ్యసభకు నామినేట్ చేయాలన్న చర్చ వచ్చింది. ఈ రాజ్యసభ కాల పరిమితి పూర్తైన తర్వాత సదురు సభ్యుడు తనకు నచ్చితే లోక్సభకు గానీ, అసెంబ్లీకి గానీ పోటీ చేసుకోవచ్చు. అంతేకానీ.. మూడోసారి మాత్రం రాజ్యసభకు ఆయన్ను నామినేట్ చేయం అన్న నిర్ణయానికి దాదాపుగా వచ్చామన్నారు.
ఇక పై రాజ్యసభకు మాత్రమే కాలపరిమితి విధించడం లేదని, దీనితో పాటు ఆఫీస్ బేరర్స్ అందరికీ తమ తమ పదవుల విషయంలో ఓ కాలపరిమితి విధించనున్నారు. ఈ నిబంధన బ్లాక్ స్థాయి నుంచి మొదలుపెడితే ఏఐసీసీ స్థాయి వరకూ వర్తింపజేయనున్నారు. ఐదేళ్లు మాత్రమే ఆయా పదవుల్లో ఉండేలా నిబంధన పెట్టనున్నారు.
బ్లాక్ నుంచి మొదలు పెడితే ఏఐసీసీ వరకూ ఉన్న పోస్టుల్లో ఓ కాల పరిమితి తేవాలన్న చర్చ చింతన్ శిబిర్లో సాగుతోంది. ఐదేళ్ల పాటు సదురు సభ్యుడు తనకిచ్చిన పదవిలో వుంటారు. ఐదేళ్లు పూర్తి కాగానే… స్వతహాగా ఆయన తన పదవికి రాజీనామా చేసేయాలని నిబంధన తేనున్నారు. ఆ పదవికి రాజీనామా చేసిన తర్వాత సదురు సభ్యుడికి మరో బాధ్యత అప్పజెప్పనున్నారు.