న్యూఢిల్లీ : ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ శుభవార్త చెప్పింది. కరోనా కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ వేరియంట్ను రెండు గంటల్లోనే గుర్తించే టెస్టింగ్ కిట్ను దిబ్రూగఢ్ బృందం రూపొందించినట్లు పేర్కొంది. ప్రస్తుతం ఈ ప్రపంచ మహమ్మారిని గుర్తించేందుకు నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపాల్సి వస్తున్నది. దీంతో ఫలితాలు రావడానికి కనీసం నాలుగు నుంచి ఐదు రోజుల సమయం పడుతున్నది. ఈ కిట్తో వేగంగా పరీక్షలు చేయడంతో పాటు వైరస్ వ్యాప్తి చెందకుండా అడ్డుకోవచ్చని నిపుణులు పేర్కొన్నారు.
జీనోమ్ సీక్వెన్సింగ్తో ఫలితాలకు నాలుగైదు రోజుల సమయం
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఒమిక్రాన్ కేసుల మధ్య.. కొవిడ్ పరీక్షల ఫలితాలు ఆలస్యంగా వస్తుండడంపై సర్వతా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఐసీఎంఆర్ దిబ్రూగఢ్ ప్రాంతీయ వైద్య పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు కీలకమైన ముందడుగు వేశారు. కొత్త వేరియంట్ కేసులు భారత్లో 35కి పెరిగాయి. పలు రాష్ట్రాలకు వివిధ దేశాల నుంచి వచ్చిన వారికి కొవిడ్ పాజిటివ్ కాగా.. నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపగా.. ఫలితాల కోసం నిరీక్షిస్తున్నారు. డాక్టర్ బిశ్వజ్యోతి బోర్కకోటి నేతృత్వంలోని ఐసీఎంఆర్ శాస్త్రవేత్తల బృందం టెస్ట్ కిట్ను అభివృద్ధి చేశారు.
వందశాతం ఖచ్చితమైన ఫలితాలు
ఒమిక్రాన్లోని ప్రత్యేక సింథటిక్ జన్యు భాగంపై పరీక్షలు నిర్వహించారు. ఇందులో వందశాతం ఖచ్చితమైన ఫలితాలు వచ్చాయి. ప్రస్తుతం వేరియంట్ను గుర్తించేందుకు టార్గెటెడ్ సీక్వెన్సింగ్కు 36 గంటలు, జీనోమ్ సీక్వెన్సింగ్కు 4 నుంచి 5 రోజుల సమయం పడుతుందని, కిట్ను అభివృద్ధి చేయడం చాలా ముఖ్యమని డాక్టర్ బోర్కకోటి చెప్పారు. ప్రత్యేకమైన విషయమేంటంటే సాధారణ స్వాబ్ శాంపిల్ ద్వారా వైరస్ను గుర్తించారు. ఈ కిట్ను పూర్తిగా ప్రభుత్వ – ప్రైవేటు భాగస్వామ్యంతో తయారు చేసుండగా.. కోల్కతాలోని డీసీసీ బయోటెక్కు ఐసీఎంఆర్ కాంట్రాక్ట్ ఇచ్చింది.