NSA Ajit Doval : జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) చైనాలో పర్యటించనున్నారు. చైనాతో దశాబ్దాలుగా ఉన్న సరిహద్దు సమస్య పరిష్కారానికి అక్కడి ఉన్నతాధికారులతో దోవల్ చర్చించనున్నారు. ఆగష్టు 24, సోమవారం దోవల్.. చైనా రాజధాని బీజింగ్ వెళ్తారు. అక్కడ సరిహద్దు వివాదంపై చైనా ప్రతినిధి వాంగ్ యితో మంగళవారం చర్చలు జరుపుతారు.
ఇవి ఇరు దేశాల మధ్య సరిహద్దు సమస్యపై జరగనున్న 25వ దశ చర్చలు. ఇరు దేశాల మధ్య శాంతి నెలకొనేందుకు, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్ఏసీ) వద్ద ఉద్రిక్తతలు తగ్గించేందుకు, దశాబ్దాలుగా ఉన్న సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకునేందుకు ఈ చర్చలు జరుగుతాయి. రాజకీయ, ద్వైపాక్షిక చర్యల ద్వారా సరిహద్దు సమస్యకు ముగింపు పలకాలని ఇరు దేశాలు భావిస్తున్నాయి. ఈ సమస్య ప్రాథమిక అంశాలపై ఈ చర్చలో ప్రధానంగా దృష్టి సారిస్తారు. సరిహద్దులో ఇప్పటికే ఇరు దేశాల సైన్యం మోహరించి ఉంది.
పరిస్థితులు అప్పుడప్పుడూ ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో సరిహద్దు సమస్య పరిష్కారం కోసం 2003 నుంచి రెండు దేశాల ప్రత్యేక ప్రతినిధుల సమావేశం జరుగుతూ వస్తోంది. అందులో ఇది 25వ సమావేశం. ఇండియా-చైనా మధ్య 3,488 కిలోమీటర్ల సరిహద్దుపై వివాదం నడుస్తోంది. రెండు దేశాలు ఈ ప్రదేశాలు తమవంటే తమవి అని చెప్పుకొంటున్నాయి. దీంతో వివాదం కొనసాగుతోంది. ఇక, ఇండియాలో సెప్టెంబర్ 12, 13 తేదీలలో బ్రిక్స్ సదస్సు జరగనుంది. దీనికి చైనా అధ్యక్షుడు జిన్పింగ్ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో తాజా చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.