లక్నో: బుల్డోజర్ ముందుకొస్తే సైకిలైనా, మరేదైనా నిమిషంలో ఖతమవుతాయని బీజేపీ ఎంపీ హేమామాలని వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ ఆమె ఈ వ్యాఖ్య చేశారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వరుసగా రెండోసారి అధికారంలోకి రాబోతోంది. ఇవాళ మధ్యాహ్నానికి ఆ పార్టీ 250కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నది.
దీనిపై హేమామాలిని మాట్లాడుతూ.. యూపీలో మళ్లీ తమ ప్రభుత్వమే ఏర్పాటవుతుందని తమకు ముందే తెలుసని అన్నారు. గడిచిన ఐదేండ్ల కాలంలో తాము రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశామని చెప్పారు. అందుకే ప్రజలు తమపై విశ్వాసంతో మళ్లీ గెలిపించారని చెప్పారు. అంతేగాక, బుల్డోజర్ ముందుకు ఏవీ రాలేవని, ఒకవేళ వస్తే అది సైకిలైనా, మరేదైనా నిమిషంలో ఫినిష్ అవ్వాల్సిందేనని హేమామాలిని వ్యాఖ్యానించారు.