న్యూఢిల్లీ: నోట్ల రద్దు గురించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నొటిఫికేషన్ చట్టవ్యతిరేకమైందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగరత్న తెలిపారు. నోట్ల రద్దు అంశాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఇవాళ సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. నోట్ల రద్దు చర్యను అయిదుగురు సభ్యుల ధర్మాసనం 4-1 తేడాతో సమర్థించింది. ఆ పిటిషన్లను సుప్రీం కొట్టిపారేసింది. అయితే ధర్మాసనంలోని జస్టిస్ నాగరత్న మాత్రం నోట్ల రద్దు అంశాన్ని తప్పుపట్టారు. ఆ చర్య చట్టవ్యతిరేకంగా సాగినట్లు ఆమె తెలిపారు. నోట్ల రద్దు చర్య కేంద్రం చేపట్టాల్సింది కాదు అని ఆమె అన్నారు.
2016, నవంబర్ 8న, కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్ చట్టవ్యతిరేకమని, పిటిషన్లు దాఖలు చేసినవారితో ఏకీభవిస్తున్నట్లు ఆమె తన తీర్పలో పేర్కొన్నారు. ఆర్బీఐలోని సెక్షన్ 26 ప్రకారం.. ఆ సంస్థ వ్యక్తిగతంగా నోట్ల రద్దు సిఫారసు చేసి ఉండాల్సిందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన సలహా మేరకు డిమానిటైజేషన్ చేయడం సరికాదు అని ఆమె అన్నారు. నా అభిప్రాయంలో నవంబర్ 8 నోటిఫికేషన్ చట్టవ్యతిరేకమని, కానీ 2016 నాటి సంఘటనపై ఇప్పుడు నిలుపుదల చేయలేమని తెలిపారు. నోట్ల రద్దు అంశం చట్టం పరిధిలో జరగలేదని, అది అధికారంతో జరగిందని, అందుకే దాన్ని చట్టవ్యతిరేక నిర్ణయమని అభిప్రాయపడుతున్నట్లు ఆమె వెల్లడించారు.
నోట్ల రద్దు నిర్ణయాన్ని అమలు చేసిన తీరు చట్టం ప్రకారం సాగలేదన్నారు. ఆర్బీఐ బోర్డు ఇచ్చే ప్రతిపాదన మేరకు నోట్ల రద్దు అమలు సాగాలని, కానీ నోట్ల రద్దు చేపట్టాలని కేంద్రం నవంబర్ 7వ తేదీన ఆర్బీఐ బోర్డుకు లేఖ రాసిందని, ఇది సరైన విధానం కాదు అని జస్టిస్ నాగరత్న తెలిపారు. పార్లమెంట్ ద్వారా నోట్ల రద్దు ప్రక్రియను చేపడితే బాగుండేదని, కానీ ఎగ్జిక్యూటివ్ నోటిఫికేషన్ సరిగా లేదన్నారు. కేంద్ర ప్రోద్భలతంతోనే ఆ చర్య చేపట్టారని, కానీ ఆర్బీఐ వ్యక్తిగత స్వేచ్ఛ ద్వారా జరిగినట్లు లేదన్నారు.