తిరువనంతపురం: కేరళలో మరో వైరస్ కలకలం రేపుతున్నది. తీవ్రంగా వ్యాపించే నోరో వైరస్ కేసులు వాయనాడ్ జిల్లాలో నిర్ధారణ అయ్యాయి. ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ శుక్రవారం ఈ విషయాన్ని వెల్లడించారు. వైత్తిరి సమీపంలోని పూకోడ్లోని వెటర్నరీ కళాశాలలో 13 మంది విద్యార్థులకు గత వారం ఇది సోకినట్లు తెలిపారు. జంతువుల ద్వారా సంక్రమించే నోరో వైరస్, కలుషితమైన నీరు, ఆహారం ద్వారా వ్యాపిస్తుందని చెప్పారు. వ్యాధి నియంత్రణకు మార్గదర్శకాలను జారీ చేశారు.
నోరో వైరస్పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న వీణా జార్జ్, లక్షణాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. కడుపు, పేగుల్లో వాపు, కడుపు నొప్పి, తీవ్రమైన వాంతులు, అతిసారం, జీర్ణాశయానికి సంబంధించిన వ్యాధి లక్షణాలు ఉంటాయన్నారు. ‘సరైన నివారణ, చికిత్సతో నోరో వైరస్ వ్యాధి త్వరగా నయమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వ్యాధి, దాని నివారణ మార్గాల గురించి తెలుసుకోవాలి’ అని పేర్కొన్నారు. తాగునీటి వనరులు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలన్నారు. సూపర్ క్లోరినేషన్ జరుగుతోందని తెలిపారు.