న్యూఢిల్లీ: చైనాతో తాజా ఘర్షణల నేపథ్యంలో ఈశాన్య సరిహద్దు ప్రాంతంలో వాయు విన్యాసాలను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్) నిర్వహిస్తున్నది. అయితే తమ సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకే ఈ విన్యాసాలు చేపట్టినట్లు భారత వాయు సేన తెలిపింది. ముందుగా నిర్ణయించిన ప్రణాళిక మేరకు గురువారం, శుక్రవారం తూర్పు ఎయిర్ కమాండ్ ఆధ్వర్యంలో ఈశాన్య ప్రాంతంలో వాయు విన్యాసాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. భారత్, చైనా సరిహద్దు ప్రాంతమైన తవాంగ్లో ఈ నెల 9న ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణకు, ప్రస్తుత వాయు విన్యాసాలకు ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చింది.
కాగా, ఈశాన్య సరిహద్దులో చైనా కవ్వింపులను భారత వాయు సేన ధీటుగా తిప్పికొడుతున్నది. చైనా యుద్ధ విమానాలు ఇటీవల పలుమార్లు వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) సమీపానికి వచ్చాయి. గమనించిన ఇండియన్ ఎయిర్ఫోర్స్, యుద్ధ విమానాలను రంగంలోకి దించింది. దీంతో చైనా ఫైటర్ జెట్లు తోక ముడిచాయి.
ఈ నెల 9న తవాంగ్ ప్రాంతంలో ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ జరిగింది. కర్రలతో దాడి చేసుకోవడంతో ఇరు దేశాల సైనికులు గాయపడ్డారు. ఈ సందర్భంగా చైనా ఫైటర్ జెట్లు ఎల్ఏసీ సమీపానికి వచ్చాయి. అప్రమత్తమైన భారత యుద్ధ విమానాలు కూడా వెంటనే గాల్లోకి లేచి ఎదురుదాడికి సిద్ధమయ్యాయి.