న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు లేరని, ఎవరు నిర్ణయాలు తీసుకుంటున్నారో తెలియడం లేదని ఆ పార్టీ సీనియర్ నేత కపినల్ సిబల్ విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పంజాబ్లో రాజకీయ పరిణామాలు, పార్టీ తీరుపై బుధవారం ఆయన మరోసారి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. పార్టీపై గళమెత్తిన జీ-23లోని ఒకరిగా ఆయన మాట్లాడారు. పార్టీ హై కమాండ్కు దగ్గరగా ఉన్నట్లు భావించే వారిని దూరం చేసి ఇతరులు ముందు వరుసలో ఉండటం హాస్యాస్పదంగా ఉందన్నారు. కాంగ్రెస్పై అసంతృప్తి గళమెత్తిన 23 మంది నేతల బృందం జీ హుజూర్ అనే 23 మందికి మద్దతుగా నిలువరని, పార్టీ సమస్యలను లేవనెత్తుతూనే ఉంటారని అన్నారు.
కాంగ్రెస్ ప్రస్తుత పరిస్థితి చూసి తన హృదయం ద్రివించిపోతున్నదని సిబల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఉండే 20 మంది నేతలతోనే ప్రజాస్వామ్యం పని చేయదని తెలిపారు. పార్టీ నాయకుల అభిప్రాయాలను విని ఆత్మపరిశీలన చేసుకోవాలని అధిష్ఠానానికి సూచించారు. కాంగ్రెస్ పరిస్థితిపై చర్చించేందుకు అత్యవసరంగా సీడబ్ల్యూసీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సోనియా గాంధీకి పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ లేఖ రాసిన సంగతిని ఆయన గుర్తు చేశారు. ‘ఇది చాలా స్పష్టం. మేము జీ 23.. జీ హుజూర్ 23 కాదు. పార్టీపై మేము మాట్లాడుతూనే ఉంటాము. మా డిమాండ్లను పునరుద్ఘాటిస్తూనే ఉంటాము’ అని వ్యాఖ్యానించారు.
పంజాబ్లో కాంగ్రెస్ పరిణామాలపై కపిల్ సిబల్ తనదైన శైలిలో స్పందించారు. ‘నేను పంజాబ్ గురించి మాట్లాడాలనుకోవడం లేదు. కానీ, సరిహద్దు రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నది ఏమిటి? ఇది ఐఎస్ఐ, పాకిస్థాన్కు ప్రయోజనం. పంజాబ్ చరిత్ర, అక్కడ తీవ్రవాదం గురించి తెలుసు. అనిశ్చితి వాతావరణాన్ని సృష్టించడానికి సరిహద్దుల్లోని శక్తులు పరిస్థితిని ఎలా ఉపయోగించుకుంటాయో మాకు తెలుసు. ఈ శక్తులే దేశానికి అతిపెద్ద ముప్పు. కాంగ్రెస్ ఐక్యంగా ఉండేలా అధిష్ఠానం చూసుకోవాలి. ఎవరికైనా సమస్య ఉంటే, దానిపై చర్చించాలి’ అని సిబల్ సూచించారు.