న్యూఢిల్లీ: హై రిస్క్ కాకపోతే, కరోనా రోగుల కాంటాక్ట్లకు టెస్ట్ చేయాల్సిన అవవసరం లేదని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. కరోనా పరీక్షలు, రోగుల కాంటాక్ట్ వ్యక్తుల నుంచి నమూనాల సేకరణకు సంబంధించి తాజా మార్గదర్శకాలను సోమవారం జారీ చేసింది. పాజిటివ్ కాంటాక్ట్ వ్యక్తులకు ఎలాంటి లక్షణాలు లేకపోయినా, వయసు పైబడి ఇతర అనారోగ్య సమస్యలున్న హై రిస్క్ వ్యక్తులు కాకపోతే కరోనా టెస్ట్ నిర్వహించాల్సిన పని లేదని తెలిపింది.
అయితే 60 ఏండ్లు పైబడిన వారు, మధుమేహం, రక్తపోటు, దీర్ఘకాలిక ఊపిరితిత్తులు లేదా మూత్రపిండ వ్యాధి, ప్రాణాంతకత వ్యాధులు, ఊబకాయం వంటి అనారోగ్యాలతో బాధపడుతున్న రోగుల కాంటాక్ట్లను మాత్రమే హై రిస్క్ వ్యక్తులుగా ఐసీఎంఆర్ పేర్కొంది. అలాంటి వారికే కరోనా టెస్ట్ చేయాలని సూచించింది.
మరోవైపు ప్రసవం కోసం ఆసుపత్రిలో చేరిన గర్భిణీలతో సహా శస్త్రచికిత్స లేదా నాన్-సర్జికల్ రోగులకు ఎలాంటి లక్షణాలు లేకపోతే కరోనా టెస్ట్ చేయవద్దని ఐసీఎంఆర్ తెలిపింది. కరోనా టెస్ట్ కారణంతో అత్యవసర సర్జరీలను వాయిదా వేయవద్దని సూచించింది. అయితే కొన్ని అంశాల పరిగణనతో చికిత్స చేస్తున్న వైద్యుని అభీష్టానుసారం కరోనా పరీక్షలు చేయవచ్చని పేర్కొంది. అంతరాష్ట్ర ప్రయాణికులకు కూడా కరోనా టెస్ట్ అవసరం లేదని వెల్లడించింది. ఈ మేరకు కోవిడ్-19 పర్పసివ్ టెస్టింగ్ స్ట్రాటజీ అడ్వైజరీని జారీ చేసింది.