చండీగఢ్: అత్యాచారం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్కు (Gurmeet Ram Rahim) పదే పదే పెరోల్ మంజూరు చేయడంపై పంజాబ్, హర్యానా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇకపై కోర్టు అనుమతి లేకుండా ఆయనకు పెరోల్ మంజూరు చేయవద్దని హర్యానా ప్రభుత్వాన్ని ఆదేశించింది. అత్యాచారం కేసులో 20 ఏళ్లు జైలు శిక్ష పడిన గుర్మీత్ రామ్ రహీమ్ ఇప్పటి వరకు పెరోల్పై 91 రోజులు జైలు నుంచి బయటకు వచ్చాడు. గత నాలుగేళ్లలో తొమ్మిదిసార్లు ఆయనకు పెరోల్ మంజూరు చేశారు. ఈ ఏడాది జనవరిలో ఏకంగా 50 రోజులు పెరోల్పై జైలు నుంచి బయటకు వచ్చాడు. గత పది నెలల్లో ఇది ఏడవ పెరోల్ కావడం విశేషం.
కాగా, గుర్మీత్ రామ్ రహీమ్కు హర్యానా ప్రభుత్వం పదే పదే పెరోల్ మంజూరు చేయడం, ఎన్నికల సమయంలో ఎక్కువగా జైలు నుంచి ఆయన బయటకు రావడంపై పంజాబ్, హర్యానా హైకోర్టులో ఎస్జీపీసీ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు, తాజా పెరోల్ గడువు ముగిసే మార్చి 10న గుర్మీత్ లొంగిపోయేలా చూడాలని హర్యానా ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇకపై కోర్టు అనుమతితోనే పెరోల్ మంజూరు చేయాలని పేర్కొంది. అలాగే గుర్మీత్ మాదిరిగా ఎంత మందికి ఈ విధంగా పేరోల్ ఇచ్చారో అన్న సమాచారం ఇవ్వాలని హర్యానా ప్రభుత్వాన్ని ఆదేశించింది.