న్యూఢిల్లీ: దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తి, కొత్త కరోనా వేరియంట్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో బూస్టర్ డోస్పై చర్చ జరుగుతున్నది. కాగా, ముందు జాగ్రత్త డోసుగా కేంద్రంగా పేర్కొంటున్న మూడో డోసులో ఎలాంటి మిక్స్ అండ్ మ్యాచ్ వ్యాక్సిన్లు ఉండవని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సీనియర్ వర్గాలు తెలిపాయి. కోవిషీల్డ్ లేదా కోవాగ్జిన్ టీకా మొదటి, రెండో డోసు తీసుకున్న వ్యక్తులకు మూడో డోసుగా వాటినే ఇస్తారని పేర్కొన్నాయి. అయితే రెండో, మూడో డోసు మధ్య 9-12 నెలల గ్యాప్ అన్నది కీలక అంశమని వెల్లడించారు.
ఆరోగ్య, ఫ్రంట్లైన్ కార్యకర్తలు, అనారోగ్య సమస్యలున్న సీనియర్ సిటిజన్స్కు తొలుత బూస్టర్ డోస్ వేస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రికాషనరీ డోసు ప్రక్రియ జనవరి 10 నుంచి ప్రారంభమవుతుందన్నారు. సోమవారం సమావేశం కానున్న నిఫుణుల కమిటీ దీనిపై తుది నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు.