న్యూఢిల్లీ: ప్రతి మూడు కుటుంబాల్లో రెండు… ఈ దీపావళికి పటాకులు కాల్చే ఆలోచనలో లేవని ఓ సర్వే వెల్లడించింది. దీనికి పెరిగిపోతున్న కాలుష్యం, అధికారులు నిషేధం విధించడంతో పటాకులు అందుబాటులో లేకపోవడం వంటి కారణాలను అత్యధికులు ప్రస్తావించినట్టు తెలిపింది. పటాకులపై కొంతమేర నిషేధాన్ని 42 శాతం కుటుంబాలు సమర్థించగా, ఎలాంటి ఆంక్షలైనా విధించవచ్చని 53 శాతం కుటుంబాలు అభిప్రాయపడ్డాయి. ‘లోకల్ సర్కిల్స్’ అనే కమ్యూనిటీ సోషల్ మీడియా వేదిక దేశవ్యాప్తంగా ఈ సర్వే నిర్వహించింది. కాలుష్యానికి కారణమవుతాయి కాబట్టి పటాకులు కాల్చాలనుకోవడం లేదని అనేక కుటుంబాలు తెలిపాయి. అంతేకాకుండా ఈ ఏడాది కరోనా ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపింది. ఇంకా ఎవరో ఒకరు కరోనాతో లేదా ఇతర ఆరోగ్యసమస్యలతో బాధపడుతున్న కుటుంబాలూ చాలా ఉన్నా యి. కాబట్టి ఆ కుటుంబాలేవీ పండుగ జరుపుకోవడం లేదు. సర్వేలో భాగంగా 371 జిల్లాల్లో 28 వేల మంది అభిప్రాయాలు సేకరించారు.
అమెరికాలో ‘దీపావళి సెలవు’ బిల్లు!
భారతీయులు ఎంతో ఘనంగా జరుపుకునే దీపావళి పర్వదినాన్ని ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాలని అమెరికా కాంగ్రెస్ చట్టసభ్యురాలు కరోలిన్ మెలోనే ప్రతిపాదించారు. ఈ మేరకు బుధవారం కాంగ్రెస్లో ఓ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లుకు ఇండియన్ కాకస్కు చెందిన కాంగ్రెస్ సభ్యులు రో ఖన్నా, రాజాకృష్ణమూర్తి తదితరులు మద్దతు తెలుపనున్నారు.