హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ): రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, కొవిడ్ లాంటి విపత్తుల నేపథ్యంలో విదేశాల నుంచి భారత్కు తిరిగి వచ్చిన విద్యార్థులకు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) స్వల్ప ఊరట కల్పించింది. విదేశీ విద్యాసంస్థల్లో ఈ ఏడాది జూన్ 30లోగా మెడికల్ కోర్సు పూర్తిచేసినట్టు సర్టిఫికెట్లు పొందినవారికి ‘ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్’ (ఎఫ్ఎంజీఈ) రాసేందుకు అనుమతి ఇచ్చింది. విపత్తుల కారణంగా వేలాది మంది భారత వైద్య విద్యార్థులు విదేశాల్లో చివరి సంవత్సరం విద్యను అభ్యసించకుండానే స్వదేశానికి తిరిగి వచ్చేశారు.
వారిలో కొందరు ఇక్కడి నుంచే కోర్సును పూర్తిచేయగా.. మరికొందరిని ఆయా విదేశీ విద్యాసంస్థలే నేరుగా పాస్ చేసి, కోర్సు పూర్తి చేసినట్టుగా సర్టిఫికెట్లు ఇచ్చాయి. అలాంటివారికి ఎఫ్ఎంజీ రాసేందుకు అనుమతి ఇవ్వాలని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఎన్ఎంసీ తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. అయితే ఎఫ్ఎంజీ తర్వాత విద్యార్థులు కచ్చితంగా ‘కంపల్సరీ రొటేటింగ్ మెడికల్ ఇంటర్న్షిప్’ (సీఆర్ఎంఐ) కోర్సు పూర్తిచేయాలని స్పష్టం చేసింది. ఈ కోర్సు కాల వ్యవధి రెండేండ్లు. చివరి సంవత్సరంలో క్లినికల్ ట్రైనింగ్కు హాజరుకాని విద్యార్థులకు ఈ కోర్సు ద్వారా శిక్షణ లభిస్తుందని ఎన్ఎంసీ తెలిపింది. సీఆర్ఎంఐ కోర్సు తర్వాతే వారు మెడికల్ ప్రాక్టీస్కు అర్హులు అవుతారని పేర్కొన్నది. ఈ వెసులుబాటు ఈ ఒక్కసారికేనని, భవిష్యత్తులో కొనసాగదని ఎన్ఎంసీ స్పష్టం చేసింది.