న్యూఢిల్లీ: జాతీయ దర్యాప్తు సంస్థ ఇవాళ ఏడు రాష్ట్రాల్లో సోదాలు చేస్తోంది. ప్రిజన్ రాడికలైజేషన్ కేసు(Prison Radicalisation Case)లో ఆ తనిఖీలు చేపట్టింది. లష్కరే తోయిబా ఉగ్రవాదులు జైలు ఖైదీలను ఉగ్రవాదం వైపు మళ్లిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆ కేసుతో లింకున్న ప్రదేశాల్లో ఇవాళ ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. కర్నాటక, తమిళనాడుతో పాటు మరో అయిదు రాష్ట్రాల్లోని 17 ప్రదేశాల్లో తనిఖీలు జరుగుతున్నాయి.
బెంగుళూరు సిటీ పోలీసుల ఈ కోణంలో తొలి సారి కేసు నమోదు చేశారు. గత ఏడాది ఆయుధాలు, మందుగుండ సామాగ్రి స్వాధీనం చేసుకున్న తర్వాత పోలీసులు కేసు బుక్ చేశారు. ఏడు పిస్తోళ్లు, నాలుగు హ్యాండ్ గ్రానేడ్లు, 45 లైవ్ రౌండ్లు, నాలుగు వాకీటాకీలు సీజ్ చేశారు.
ఆ కేసులో అయిదుగుర్ని తొలుత అరెస్టు చేశారు. వాళ్లను విచారించిన తర్వాత మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో అరెస్టు అయిన వారి సంఖ్య ఆరుకు చేరుకున్నది. ఈ కేసులో లష్కరే తోయిబా ఉగ్రవాది టీ నజీర్ ప్రధాన సూత్రధారిగా ఉన్నారు. బెంగుళూరు సెంట్రల్ జైలులో ఉన్న అయిదుగుర్నిఅతను రాడికలైజ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసులో జునైద్ అహ్మద్ అనే వ్యక్తి కూడా నిందితుడే. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు.
బెంగుళూరు సెంట్రల్ జైలులో 2013 నుంచి నజీర్ ఖైదీగా ఉన్నాడు. 2017లో కొంత మంది ఖైదీలు చేరడంతో వాళ్లను రాడికలైజ్ చేసి పనిలో పడ్డాడు అతను. గత అక్టోబర్లో ఈ కేసును ఎన్ఐఏ తీసుకున్నది. ఆ తర్వాత రెయిడ్స్ నిర్వహించింది.