Pandemic | కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తూనే ఉన్నది. కొత్త కొత్త రూపాలను మార్చుకుంటూ పంజా విసురుతున్నది. మొన్నటి వరకు శాంతించిన వైరస్ మళ్లీ జడలువిప్పుతున్నది. ఇటీవల సింగపూర్ సహా పలు దేశాల్లో కేసులు పెరగడం సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. ఈ క్రమంలోనే బ్రిటన్ ప్రభుత్వ మాజీ ప్రధాన సలహాదారు సర్ పాట్రిక్ వాలెన్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా తరహా మరో సంక్షోభాన్ని మానవాళి ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు.
కరోనావైరస్ మహమ్మారి భయంకరమైన అనుభవాల నుంచి ప్రపంచం బయటపడిందని.. అదే తరహా సంక్షోభం ఎదుర్కోవడం ‘ఖచ్చితంగా అనివార్యం’ అన్నారు. ఈ దిశలో అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ఆయన ప్రపంచదేశాలకు పిలుపునిచ్చారు. సంక్షోభం ఎదురైన సమయంలో తక్షణమే స్పందించేందుకు అవసరమైన ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని సూచించారు. అవసరమైన స్థాయిలో వైద్య పరీక్షల నిర్వహణ సామర్థ్యం, టీకాలు, చికిత్సలు అన్ని అందుబాటులో ఉంచుకోవాలని.. దాంతో లాక్డౌన్, సోషల్ డిస్టెన్స్ తదితర వంటి కఠిన చర్యలు అవసరం ఉండబోదన్నారు.
2021లో తాను చేసిన సూచలన్నీ 2023 నాటికి అనేక దేశాలు మరచిపోయాయన్నారు. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. సైనిక అవసరాల విషయంలో ఎలా అప్రమత్తమై ఉంటామో.. సంక్షోభం కట్టడి చర్యలకు సైతం అంతే ప్రాధాన్యం ఇవ్వాల్సిందేనన్నారు. యుద్ధంతో నిమిత్తం లేకుండా ఆర్మీ అవసరాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లుగానే సంక్షోభ నివారణ వ్యవస్థలపై దృష్టి పెట్టాలని సూచించారు. సంక్షోభ సమయంలో వివిధ దేశాలు కలిసికట్టు చర్యలు తీసుకునేలా ఒప్పందం కుదుర్చుకునేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ చొరవ తీసుకోవాలని పాట్రిక్ వాలెన్స్ పిలుపునిచ్చారు.