న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11: పుట్టగొడుగుల్లా వెలిసిన డిజిటల్ సైట్లు ఒకవైపు, సోషల్మీడియా విప్లవం మరోవైపు, కరోనా సంక్షోభం ఇంకోవైపు.. వెరసి సంప్రదాయ ప్రింట్ మీడియా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటున్నది. అయితే పాఠకులు, ప్రకటనకర్తల నమ్మకాన్ని చూరగొనడంలో మాత్రం ప్రింట్ మీడియా అంతకంతకూ బలోపేతమవుతున్నదని ప్రముఖ మీడియా సంస్థ ‘హవాస్ మీడియా గ్రూప్ ఇండియా’ ఇటీవల చేసిన అధ్యయనంలో తేలింది. కరోనా సంక్షోభంతో గతేడాది వార్తా పత్రికల సర్క్యులేషన్, రీడర్షిప్ తగ్గినప్పటికీ, వినూత్న వార్తాంశాలను చేరవేయడంలో పత్రికలే ముందుంటాయని ఇప్పటికీ పాఠకులు బలంగా విశ్వసిస్తున్నట్టు వెల్లడించింది. తమ ఉత్పత్తులు వినియోగదారులను చేరుకోవడానికి పత్రికలే సరైన వేదికలని పలు బ్రాండ్లు, మార్కెటింగ్ కంపెనీలు నమ్ముతున్నట్టు వివరించింది. దేశంలోని 14 నగరాల్లోని 2 లక్షల మంది పత్రికా చందాదారులపై ఈ సర్వే చేపట్టారు.
డిజిటల్ దిగ్గజాలకూ పత్రికలే దిక్కు..
ఎన్నో మాధ్యమాల ద్వారా రీడర్లకు వార్తలు చేరుతున్నప్పటికీ, విశ్వసనీయతకు మాత్రం ప్రింట్ మీడియానే చిరునామాగా మారింది. అందుకే, గూగుల్, ఫేస్బుక్ వంటి డిజిటల్ మీడియా దిగ్గజాలు సైతం తమ ప్రచారాన్ని ప్రింట్ మీడియాలోనే చేస్తున్నాయి. కరోనా కారణంగా వార్తా పత్రికల వృద్ధిరేటు కొంత తగ్గినప్పటికీ, త్వరలోనే ఆ మాధ్యమాలు మళ్లీ పుంజుకుంటాయి.
-సంచితా రాయ్, ఇండియా హెడ్ స్ట్రాటజీ,
హవాస్ మీడియా గ్రూప్ ఇండియా.