ముంబై: మహారాష్ట్రకు చెందిన శివసేన (యూబీటీ) నేత, ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ (Sanjay Raut) కొత్త పార్లమెంట్ భవనంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దానిని ఫైవ్ స్టార్ జైలుగా అభివర్ణించారు. పార్లమెంట్ పని తీరు తీవ్రంగా దెబ్బతిన్నదని విమర్శించారు. గురువారం సంజయ్ రౌత్ మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలోని సెంట్రల్ విస్తా పరిస్థితిని ప్రతి ఒక్కరూ చూడాలని అన్నారు. ఎంపీలు ఎదుర్కొంటున్న సమస్యలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘కొత్త పార్లమెంట్ పని చేయలేని ఫైవ్ స్టార్ జైలు లాంటిది’ అని వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష కూటమి ‘ఇండియా బ్లాక్’ కేంద్రంలో అధికారంలోకి వస్తే చారిత్రక పాత పార్లమెంటు భవనానికి పార్లమెంట్ సమావేశాలను మార్చాలన్నది తమ పార్టీ ఉద్దేశమని తెలిపారు. ‘మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు, మన చారిత్రక పార్లమెంటులో సమావేశాలు నిర్వహిస్తాం’ అని అన్నారు.
కాగా, రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 400 కంటే ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలకు సంజయ్ రౌత్ కౌంటర్ ఇచ్చారు. 543 లోక్సభ స్థానాలకుగాను 600 సీట్లు గెలుచుకుంటామని ప్రగల్భాలు పలికితే మహారాష్ట్ర ప్రజలు చప్పట్లు కొడతారని అన్నారు. 2024 ఎన్నికల్లో 400కు బదులు 600 సీట్లు టార్గెట్గా ప్రధాని మోదీ పెట్టుకోవాలని ఎద్దేవా చేశారు.