Hydrogen Train | భారతదేశపు తొలి హైడ్రోజన్ ట్రైన్ పట్టాలెక్కేందుకు సిద్ధమైంది. డిసెంబర్ నెలాఖరులో ట్రయల్ రన్ జరుగబోతున్నది. ఇక వచ్చే ఏడాది అందుబాటులోకి రాబోతున్నది. తొలిసారిగా ఈ రైలు జింద్ – సోనిపట్ మార్గంలో నడువనున్నది. ఢిల్లీలో డివిజన్లోని 89 కిలోమీటర్ల మార్గంలో రాకపోకలు సాగిస్తుంది. 2030 నాటికి భారత్లో కార్బన ఉద్గారాలను తగ్గించాలని కేంద్రం కసరత్తు చేస్తున్నది. ఇందులో భాగంగా హైడ్రోజన్ రైళ్లను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ప్రస్తుతం భారతీయ రైల్వేలో ఎలక్ట్రిక్, డీజిల్తో రైళ్లు నడుస్తున్నది. ప్రస్తుతం కొత్తగా హైడ్రోజన్తో రైలును నడిపించేందుకు ప్రయత్నిస్తున్నది. భారతీయ రైల్వేశాఖ భారీ ప్రణాళికలో భాగంగా నేషనల్ హెరిటేజ్, కొండ ప్రాంతాల్లో 35 హైడ్రోజన్ రైళ్లను నడపాలని భావిస్తున్నది.
ఈ ప్రాజెక్టుకు హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్గా పేరు పెట్టింది. హైడ్రోజన్ రైళ్లు పర్యావరణానికి మేలు చేస్తాయి. వాటితో కాలుష్యం ఏమాత్రం ఉండదు. 2030 నాటికి రైల్వేలు తమను తాము నెట్ జీరో కార్బన్ ఎమిటర్గా తీర్చిదిద్దుకునేందుకు ప్రయత్నిస్తున్నది. ఇందులో హైడ్రోజన్ రైళ్ల లక్ష్య సాధనలో కీలకంగా మారనున్నాయి. ఇందుకోసం రైల్వేశాఖ మరిన్ని చర్యలు తీసుకుంటోంది. ఈ రైళ్లలో హైడ్రోజన్తో విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. హెచ్ఓజీ సాంకేతికతో రైలుకు అవసరమైన విద్యుత్ అంతా లోకోమోటివ్లోనే ఉత్పత్తి కానున్నది. అదే సమయంలో ఆ మార్గాల్లో రైల్వేశాఖ చెట్లను నాటడంతో పాటు రైల్వేస్టేషన్లలో సోలార్ ప్లాట్లను సైతం ఏర్పాటు చేస్తున్నది. హైడ్రోజన్ రైలు ప్రాజెక్టు కోసం రైల్వేశాఖ భారీగా ఖర్చు చేస్తోంది.
ఈ ఏడాది బడ్జెట్లో 35 హైడ్రోజన్ రైళ్లకు రూ.2800 కోట్లు కేటాయించింది. అలాగే, హెరిటేజ్ మార్గాల్లో హైడ్రోజన్ సంబంధిత మౌలిక సదుపాయాల కోసం ప్రత్యేకంగా రూ.600 కోట్లు ఇచ్చింది. అంతేకాకుండా డీజిల్తో నడిచే డెము రైలును.. హైడ్రోజన్తో నడిపే ప్రాజెక్ట్ను కూడా రైల్వే ప్రారంభించింది. ఇందుకోసం రూ.111.83 కోట్ల కాంట్రాక్టు ఇచ్చింది. ఈ ప్రాజెక్టు కింద రైలులో హైడ్రోజన్తో విద్యుత్ ఉత్పత్తి జరిగేలా ఏర్పాట్లు చేస్తారు. గ్రౌండ్ లెవెల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. ప్రస్తుతం హైడ్రోజన్ రైలు ప్రాజెక్ట్ భారతీయ రైల్వేలకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ ప్రాజెక్ట్ పర్యావరణానికి ప్రయోజనకరంగా ఉండనున్నది.