New Delhi : దేశరాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. చేతబడి చేస్తుందనే అనుమానంతో ఒక డాక్టర్ తన ఇంట్లో పని చేసే మహిళను దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన గురువారం ఉదయం జరిగింది. హంతకుడైన డాక్టర్ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఢిల్లీలో డా.మనీష్ గుప్తా డెర్మటాలజిస్ట్గా పని చేస్తున్నాడు. అతడి భార్య టీనా గుప్తా కూడా డాక్టరే. వారి ఇంట్లో మీనా అనే మహిళ చాలాకాలంగా పని చేస్తుండేది. అయితే, ఇటీవల ఆ ఇంట్లో కొన్ని మనస్పర్ధలు తలెత్తాయి. మనీష్ గుప్తా మాటల్ని అతడి భార్య, కుటుంబ సభ్యులు పట్టించుకోవడం మానేశారు.
కుటుంబ సభ్యులు తనను లెక్కచేయకుండా ఉండేందుకు, వారి ప్రవర్తన మారేందుకు పనిమనిషి మీనానే కారణం అని అతడు భావించాడు. ఇదే సమయంలో మీనాను పనిలోంచి తీసేయాలని కొంతకాలంగా భార్య, కుటుంబ సభ్యులకు చెబుతూ వచ్చాడు. కానీ, వారు మనీష్ గుప్తా మాటల్ని పట్టించుకోలేదు. ఆమెనే పని మనిషిగా కొనసాగించారు. దీనంతటికీ పని మనిషి మీనానే కారణం అని భావించాడు. కుటుంబ సభ్యులు తన మాట వినకుండా ఆమె చేతబడి చేస్తోందని, ఇంట్లోకి ఆమె నెగెటివ్ ఎనర్జీని తెస్తుందని మనీష్ భావించాడు. దీంతో అతడు మీనాపై కోపం తెచ్చుకున్నాడు. గురువారం ఉదయం మనీష్ గుప్తా భార్య టీనా గుప్తా ఇంటి నుంచి బయటకు వెళ్లింది. అదే సమయంలో పని మనిషి మీనా ఇంటికి వచ్చింది. ఇంట్లో బట్టలు ఉతికి, ఆరేసేందుకు మేడపైకి వెళ్లింది. అప్పుడు ఇంట్లో మనీష్ ఒక్కడే ఉన్నాడు. అప్పటికే మీనాపై ఆగ్రహంతో ఉన్న మనీష్.. మేడపై బట్టలు ఆరేస్తున్న మీనా వద్దకు వెళ్లి బ్యాట్తో ఆమె తలపై బలంగా కొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడి కిందపడి గిలగిలా కొట్టుకోసాగింది. అయినా, ఆగకుండా ఆమెను పలుమార్లు కత్తితో పొడిచాడు.
అటు తలకు గాయమై రక్తం కారడం, ఇటు అతడు కత్తితో పొడవడంతో మీనా రక్తపు మడుగులో పడిపోయింది. రక్తస్రావం కారణంగా కొంతసేపటికి ఆమె మరణించింది. మీనాను చంపిన అనంతరం అతడు అక్కడే ఉన్నాడు. పోలీసులు వచ్చి అరెస్టు చేసేవరకు ఆమె మృతదేహం వద్దే ఉండిపోయాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మనీష్ గుప్తాను అరెస్టు చేశారు. మీనా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసుల విచారణలో ఈ నేరం తానే చేసినట్లు మనీష్ అంగీకరించాడు. తనకు మరణశిక్ష వేయాలని పోలీసుల్ని కోరాడు. అయితే, మీనా హత్యకు ఇంకేదైనా కారణం ఉందా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు.