Nepal floods : నేపాల్ వరదల్లో మరణించిన వారి సంఖ్య 760 దాటింది. గల్లంతైన వారి సంఖ్య 2,500 వరకు ఉంది. ఇంకా అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అక్కడి వరదల్లో మరణించిన వారికి సంబంధించి గుర్తు తెలియని మృతదేహాల్ని అక్కడే ఖననం చేస్తున్నారు. మృతదేహాల్ని భద్రపరిచే విషయంలో కూడా నేపాల్ ఇబ్బందులు ఎదుర్కుంటోంది.
మృతదేహాల్ని భద్రపరిచే పరిస్థితులు కూడా అక్కడ లేవు. ఈ నేపథ్యంలో గుర్తు తెలియని మృతదేహాల్ని కూడా అక్కడే ఖననం చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. మృతదేహాల్ని ప్లాస్టిక్ ఎయిర్టైట్ బ్యాగుల్లో, 1.5 మీటర్ల లోతులో పాతిపెడుతున్నారు. ఇలా పాతిపెట్టే ముందు వారికి సంబంధించిన డీఎన్ఏ శాంపిల్స్, ఇతర ఆధారాలు సేకరిస్తున్నారు. ఒక్కో మృతదేహనికి మధ్య 40 సెంటీమీటర్ల దూరం ఉండేలా చూస్తున్నారు. భవిష్యత్తులో వారికి సంబంధించిన వారిని గుర్తించేందుకు వీలుగా ఈ పని చేస్తున్నామని నేపాల్ ప్రధాని బాలెన్ షా వెల్లడించారు.
మృతదేహాల్ని ఖననం చేసిన ప్రదేశంలో పైన సిమెంట్తో ఒక ప్లాట్ఫాం, సైన్ బోర్డు వంటివి కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు. కొన్ని చోట్ల మృతదేహాలు పాడవ్వకుండా ఇండ్లనే కూలింగ్ సెంటర్లుగా మార్చారు. మృతదేహాల్ని అక్కడే దాచేస్తున్నారు. మరోవైపు సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. అక్కడి నదుల్లో నీటి మట్టం ఇంకా పెరుగుతోంది. భారీగా నీటి ప్రవాహం ఉండటంతో అనేక మృతదేహాలు నీళ్లలో చాలా దూరం కొట్టుకుపోయినట్లు అధికారులు చెబుతున్నారు. ఇంకా వర్షం, వరదల కారణంగా సహాయక చర్యలు సరిగ్గా సాగడం లేదు.