న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: విద్యార్థి నిరసనకారులకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. వారిపై నమోదైన అన్ని ఎఫ్ఐఆర్లను రద్దు చేస్తున్నట్టు సుప్రీంకోర్టు ప్రకటించింది. అప్పటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్తో కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరిగిన పేపర్ లీక్ వ్యతిరేక నిరసనల సందర్భంగా జూలై 20-25 మధ్య జరిగిన ఘటనలకు సంబంధించి యువ నిరసనకారులపై నమోదైన అన్ని ఎఫ్ఐఆర్లను రద్దు చేయడానికి సుప్రీంకోర్టు మంగళవారం రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద తనకున్న అసాధారణ అధికారాలను వినియోగించుకుంది.
నిరసనల సమయంలో శారీరక హాని, లేదా ఆస్తి విధ్వంసానికి పాల్పడిన నేరాలలో ప్రమేయం ఉన్నట్టు దర్యాప్తులో రుజువైతేనే తీవ్రమైన నేర చరిత్ర ఉన్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న 2,873 మందిపై కొత్తగా ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి అనుమతి కోరుతూ ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన ఒక ప్రత్యేక పిటిషన్ను ప్రభుత్వం గతంలో కోర్టు ముందు ఉంచింది. ఈ అభ్యర్థన ఢిల్లీకి మాత్రమే ప్రత్యేకమైనదని పేర్కొన్న కేంద్రం అటువంటి నేరాల్లో ప్రమేయం ఉన్నట్టు నిర్ధారణ అయితే ఆ 2,873 మంది వ్యక్తులపై మాత్రమే కొత్తగా ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి అనుమతి ఇవ్వాలని కోరింది.
నష్టపరిహారం
నీట్ ప్రశ్నపత్రం లీకేజ్ కారణంగా ఆత్మహత్యకు పాల్పడిన అభ్యర్థుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లింపునకు సంబంధించి రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో సంప్రదించిన అఖిల భారత యంత్రాంగానికి సంబంధించిన విధివిధానాలను రూపొందించాలని, ఆ చట్రాన్ని నష్టపరిహార చర్యలకు ఒక సాధారణ యంత్రాంగంగా స్వీకరించాలని కోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు తీర్పుపై సీజేపీ హర్షం వ్యక్తం చేసింది.
సంపూర్ణ న్యాయం.. సుప్రీం తీర్పుపై సీజేపీ
నీట్ ప్రశ్నపత్రం లీకేజ్కు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై నమోదైన అన్ని ఎఫ్ఐఆర్లను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే సంపూర్ణ న్యాయంగా అభివర్ణించారు. ఇది విద్యార్థుల విజయమని ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతించింది. విద్యార్థులపై నమోదైన అన్యాయమైన కేసులను సుప్రీంకోర్టు కొట్టివేసింది. మా డిమాండ్లకు గుర్తింపు లభించింది. ఏ విద్యార్థీ ఇటువంటి చర్యలను ఎదుర్కొనే పరిస్థితి రాదు అని సీజేపీ పేర్కొంది. తమ డిమాండ్లు నెరవేరాయని, ఈ సంపూర్ణ న్యాయం దక్కడానికి నెలరోజులు పట్టిందని దీప్కే పేర్కొన్నారు.