ముంబై: నీట్ పేపర్ కేసు నిందితుడు ఒక చోట 8 ఎకరాల స్థలం కొనుగోలు చేశాడు. అందులో ఒక స్కూల్, కాలేజీ ఏర్పాటు కోసం కొత్తగా బిల్డింగులు నిర్మిస్తున్నాడు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అతడి ఆదాయ వనరులపై దృష్టిసారించింది. (NEET Paper Leak) నీట్ పేపర్ లీక్తో సంబంధం ఉన్న మహారాష్ట్రలోని రేణుకై కెమిస్ట్రీ క్లాసెస్ (ఆర్సీసీ) వ్యవస్థాపకుడు శివరాజ్ రఘునాథ్ మోటెగావ్కర్ను సీబీఐ అరెస్ట్ చేసింది. లాతూర్లో ప్రధాన శాఖతో సహా తొమ్మిది కోచింగ్ సెంటర్లను ఆయన నిర్వహిస్తున్నాడు.
కాగా, నీట్ పరీక్ష నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) కమిటీలో సభ్యుడైన కెమిస్ట్రీ లెక్చరర్ పీవీ కులకర్ణికి శివరాజ్ సన్నిహితుడు. లాతూర్ సమీపంలోని ఖోపేగావ్ శివారు ప్రాంతంలో 8 ఎకరాల స్థలాన్ని అతడు కొనుగోలు చేశాడు. అక్కడ ఒక స్కూల్, కాలేజీ ప్రారంభించాలని శివరాజ్ ప్లాన్ చేశాడు. ఎనిమిది ఎకరాల భూమిలోని రెండున్నర ఎకరాల్లో భారీ బహుళ అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నాడు.
మరోవైపు బిల్డింగ్ నిర్మాణం దాదాపుగా పూర్తికావస్తున్నది. ఈ నేపథ్యంలో ఎనిమిది ఎకరాల భూమి కొనుగోలు, భారీ భవనం నిర్మాణానికి సంబంధించిన నిధులు, శివరాజ్ ఆదాయ వనరులపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో సీబీఐ దీనిపై కూడా దర్యాప్తు చేస్తున్నది. నీట్ పేపర్ లీక్కు సంబంధించి ఇప్పటి వరకు పది మంది నిందితులను సీబీఐ అరెస్ట్ చేసింది.