శ్రీనగర్: జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) నేత ఒమర్ అబ్దుల్లా గురువారం క్షమాపణలు చెప్పారు. పార్టీ ఎంపీ అక్బర్ లోన్ గురించి గురువారం ఉదయం ఆయన చేసిన ట్వీట్పై ఈ మేరకు స్పందించారు. ఆయన చనిపోయినట్లుగా తొలుత ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు. అనారోగ్యం వల్ల శ్రీనగర్లో ఆయన మరణించినట్లు అందులో పేర్కొన్నారు. అయితే కొన్ని నిమిషాల తర్వాత ఆ ట్వీట్ను ఒమర్ అబ్దుల్లా తొలగించారు. వెంటనే మరో ట్వీట్ చేశారు. ‘లోన్ సాబ్ను నేను క్షమాపణలు కోరుతున్నా. ఆయన కోలుకుంటున్నారు’ అని తెలిపారు.
కాగా, శ్రీనగర్లోని షేర్-ఇ-కశ్మీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SKIMS) కూడా ఎన్సీ ఎంపీ అక్బర్ లోన్ ఆరోగ్యంపై గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆయన మరణ వార్తను ఖండించింది. అక్బర్ లోన్ మరణంపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు తప్పని పేర్కొంది. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ వల్ల ఆయన ఆసుపత్రిలో చేరినట్లు తెలిపింది. వైద్యుల చికిత్సకు అక్బర్ లోన్ స్పందిస్తున్నారని వెల్లడించింది.