చండీగఢ్, మార్చి 12: సార్వత్రిక ఎన్నికలు సమీపించిన వేళ హర్యానా రాజకీయాల్లో మంగళవారం అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యమంత్రి పదవికి మనోహర్ లాల్ ఖట్టర్ ఊహించని విధంగా రాజీనామా చేశారు. ఆయనతో పాటు 13 మంది మంత్రులు కూడా రాజీనామా సమర్పించారు. దీంతో హర్యానాలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు అనివార్యమైంది. ఇంతకాలం జన్నాయక్ జనతా పార్టీ(జేజేపీ)తో కలిసి అధికారంలో ఉన్న బీజేపీ ఇప్పుడు స్వతంత్రుల మద్దతుతో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
బీజేపీ కొత్త శాసనసభాపక్ష నేతగా ఆ పార్టీ హర్యానా అధ్యక్షుడు నాయబ్ సింగ్ సైనీని బీజేపీ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో మంగళవారం సాయంత్రం హర్యానా కొత్త ముఖ్యమంత్రిగా సైనీతో గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రమాణస్వీకారం చేయించారు. ఆయనతో పాటు బీజేపీ ఎమ్మెల్యేలు కన్వర్ పాల్, మూల్చంద్ శర్మ, జైప్రకాశ్ దలాల్, బన్వరీలాల్, స్వతంత్ర ఎమ్మెల్యే రంజిత్ సింగ్ చౌతాలా మంత్రులుగా ప్రమాణం చేశారు. కొత్త ప్రభుత్వానికి కేవలం ఏడు నెలల పదవీకాలమే ఉంది.
జేజేపీ అవసరం లేకపోవడంతో…
90 మంది సభ్యులు ఉన్న హర్యానా అసెంబ్లీకి 2019లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 41, కాంగ్రెస్ 30, జేజేపీ 10 సీట్లు దక్కించుకున్నాయి. ఏడుగురు స్వతంత్రులు, ఇండియన్ నేషనల్ లోక్దళ్(ఐఎన్ఎల్డీ) నుంచి ఒకరు, హర్యానా లోఖిత్ పార్టీ(హెచ్ఎల్పీ) నుంచి ఒకరు విజయం సాధించారు. ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ బీజేపీకి రాకపోవడంతో జేజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
బీజేపీ నుంచి ఖట్టర్ ముఖ్యమంత్రి అవగా, జేజేపీ అధ్యక్షుడు దుష్యంత్ చౌతాలా ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఇంతకాలం ఈ రెండు పార్టీల ప్రయాణం సజావుగానే సాగినా పార్లమెంటు ఎన్నికలు సమీపించిన వేళ విభేదాలు తలెత్తాయి. ఈసారి ఎన్నికల్లో హర్యానాలోని రెండు లోక్సభ స్థానాలకు పోటీ చేయాలని జేజేపీ భావిస్తున్నది. అయితే, మొత్తం 10 స్థానాల్లోనూ తమ అభ్యర్థులనే నిలపాలని బీజేపీ నిర్ణయించినట్టు తెలుస్తున్నది. దీంతో రెండు పార్టీల మధ్య దూరం పెరిగింది.
జేజేపీలో విభేదాలు ?
ఈ పరిణామాలు జేజేపీలో కూడా చిచ్చు పెట్టాయనే ప్రచారం జరుగుతున్నది. తాజా రాజకీయాలపై చర్చించేందుకు ఢిల్లీలోని తన ఫామ్హౌజ్లో దుష్యంత్ చౌతాలా ఏర్పాటుచేసిన సమావేశానికి ఐదుగురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. దీంతో జేజేపీలో చీలిక రాబోతున్నదా అనే అనుమానాలు మొదలయ్యాయి. అయితే, తమ పార్టీ ఎమ్మెల్యేలంతా ఏకతాటిపై ఉన్నారని జేజేపీ అధికార ప్రతినిధి అర్వింద్ భరద్వాజ్ పేర్కొన్నారు. తమ పార్టీ లోక్సభ ఎన్నికల్లో మొత్తం 10 స్థానాల్లో పోటీ చేస్తుందని, అక్టోబరులో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 90 స్థానాల్లో బరిలో దిగుతుందని స్పష్టం చేశారు. ఓబీసీ ఓట్లే లక్ష్యంగా సీఎం ఎంపిక
బీజేపీ ఢిల్లీ పెద్దల సూచనల మేరకు, హర్యానా నివాస్లో జరిగిన సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యేలు సైనీని శాసనసభపక్ష నేతగా ఎన్నుకున్నారు. హర్యానాలో ఎనిమిది శాతంగా ఉన్న సైనీల జనాభాతో పాటు ఓబీసీల ఓట్లనూ దక్కించుకునేందుకు బీజేపీ సైనీని ముఖ్యమంత్రి పదవికి ఎంపిక చేసినట్టు కనిపిస్తున్నది. తొమ్మిదిన్నర ఏండ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్న మనోహర్ లాల్ ఖట్టర్పై ఉన్న వ్యతిరేకత ప్రభావం లోక్సభ ఎన్నికల్లో, తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పడొద్దనేది కూడా సీఎం మార్పు వెనుక బీజేపీ పెద్దల ఉద్దేశమని తెలుస్తున్నది.
ఎవరీ నాయబ్ సింగ్ సైనీ ?
మాజీ ముఖ్యమంత్రి ఖట్టర్కు సైనీ సన్నిహితుడు. అంబాలా జిల్లా మిర్జాపూర్ మజ్రా గ్రామానికి చెందిన సైనీకి ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉంది. 2014లో ఆయన మొదటిసారి నారాయణ్గఢ్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై ఖట్టర్ మొదటి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. 2019 లోక్సభ ఎన్నికల్లో కురుక్షేత్ర నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థిపై 3.84 లక్షల భారీ మెజారిటీతో విజయం సాధించారు. గత అక్టోబరులోనే ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. కాగా, సీఎం పదవి నుంచి తప్పుకున్న ఖట్టర్ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు తెలుస్తున్నది.