గడ్చిరౌలి: మహారాష్ట్రలోని గడ్చిరౌలి(Gadchiroli Encounter) జిల్లాలో ఇవాళ తెల్లవారుజామున జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు సీనియర్ నక్సల్స్ మృతిచెందారు. ఆ నలుగురిపై 36 లక్షల రివార్డు ఉన్నది. అయితే ఆ ఎన్కౌంటర్ ఎలా జరిగిందో పోలీసులు వివరించారు. పొరుగు రాష్ట్రమైన తెలంగాణ నుంచి నలుగురు నక్సలైట్లు గడ్చిరౌలిలోకి ఎంటర్ అయినట్లు సోమవారం మధ్యాహ్నం పోలీసులకు సమాచారం వెళ్లింది. ప్రాణహిత నది దాటి మహారాష్ట్రలోకి వెళ్లిన నక్సల్స్.. లోక్సభ ఎన్నికల వేళ దుశ్చర్యలకు ప్లాన్ వేసినట్లు తెలిసింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో అటక్ చేయాలని భావించినట్లు ఎస్పీ నీలోత్పల్ తెలిపారు.
గడ్చిరౌలి పోలీసు విభాగానికి చెందిన సీ-60 ప్రత్యేక పోరాట దళాలు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించాయి. సీ-60తో పాటు సీఆర్పీఎప్ క్విక్ యాక్షన్ బృందం కూడా సెర్చ్ ఆపరేషన్లో పాల్గొన్నాయి. మంగళవారం ఉదయం రేపన్పల్లి సమీపంలో ఉన్న కోలమర్క పర్వతాల్లో సీ-50 యూనిట్ బృందాలు కూంబింగ్ నిర్వహించాయి. ఆ సమయంలో నక్సలైట్లు విచక్షణారహితంగా పోలీసులపై కాల్పులు జరిపారు. అయితే భద్రతా బలగాలు ఆ దాడుల్ని తప్పికొట్టాయని ఓ అధికారి చెప్పారు.
కాల్పులు ముగిసిన తర్వాత ఆ ప్రాంతాన్ని కుణ్ణంగా సెర్చ్ చేశారు. నలుగురు నక్సల్స్ మృతదేహాలను గుర్తించారు. అయితే ఆ నలుగురిపై 36 లక్షల రివార్డు ఉన్నట్లు తెలుస్తోంది. వారి వద్ద నుంచి ఏకే-47 గన్తో పాటు కార్బైన్, రెండు దేశవాళీ తుపాకులు, నక్సల్స్ సాహిత్యం,ఇంకా ఇతర ఐటమ్స్ను స్వాధీనం చేసుకున్నారు. మృతిచెందిన నక్సలైట్లలో కమిటీ సెక్రటరీలు వర్గీష్, మగ్తూ, ప్లాటూన్ సభ్యులు కురుసంగ్ రాజు, కుడిమెట్ట వెంకటేశ్ ఉన్నారు.