ముంబై : క్రూయిజ్ పార్టీ కేసుకు సంబంధించి ఎన్సీబీ డైరెక్టర్ సమీర్ వాంఖడేపై విమర్శలు గుప్పించినందుకు తనకు బెదిరింపు కాల్స్ వచ్చాయని ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ శుక్రవారం వెల్లడించారు. సమీర్ వాంఖడేను టార్గెట్ చేయవద్దని తనకు ఫోన్ చేసిన వ్యక్తి బెదిరించాడని, దీనిపై తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని మాలిక్ తెలిపారు. ముంబై డ్రగ్ కేసులో సమీర్ వాంఖడే ఆయన కుటుంబం లక్ష్యంగా నవాబ్ మాలిక్ పలు ఆరోపణలు చేశారు. ముందస్తు కుట్రతోనే క్రూయిజ్ పార్టీపై దాడులు చేపట్టారని విమర్శించారు.
కరోనా వైరస్ దేశాన్ని వణికించిన సమయంలో సినీ పరిశ్రమ మొత్తం మాల్దీవుల్లో మకాం వేసిందని..సమీర్ వాంఖడేకు ఆయన కుటుంబానికి మాల్దీవులు, దుబాయ్లో ఏం పని ఉందని గతంలో మాలిక్ ప్రశ్నించారు. కొందరిని తప్పుడు కేసుల్లో ఇరికించి డబ్బు వసూళ్లకు పాల్పడేందుకే మాల్లీవులు, దుబాయ్లో మంతనాలు జరిపారని అన్నారు. మరోవైపు నవాబ్ మాలిక్ తనపై, తన కుటుంబంపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని సమీర్ వాంఖడే తోసిపుచ్చారు. ఈ వ్యవహారంపై తాను న్యాయపోరాటానికి దిగుతానని స్పష్టం చేశారు.