చండీగఢ్: పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూపై ఆయన భార్య నవజ్యోత్ కౌర్ ప్రశంసల జల్లు కురిపించారు. సిద్ధూ ఒక హీరో అని, ఆయన హీరోగా మిగిలిపోతారని అన్నారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎంపికపై ఆ పార్టీ అధిష్ఠానం తర్జనభర్జన పడుతున్నది. సీఎం చన్నీ, సిద్ధూ మధ్య ప్రధానంగా పోటీ నెలకొన్నది. ఈ నేపథ్యంలో సిద్ధూ భార్య కౌర్, మీడియాతో గురువారం మాట్లాడారు. పంజాబ్కు ఎవరు సీఎం అవుతారన్నది ముఖ్యం కాదన్నారు.
ఎవరు సీఎం అయినా కూడా మంత్రుల మాట వినాలని, వారు ఆమోదించిన ఫైళ్లపై సంతకాలు చేయాలని కౌర్ అన్నారు. మంత్రులు తమ పని తాము చేసే విధంగా సీఎం వ్యవహరించాలని ఆమె సూచించారు. పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ఇలా చేసి ఉంటే ఎవరికీ ఇబ్బంది ఉండేది కాదన్నారు. కానీ ఆయన అలా పని చేయలేదని, ఇతర మంత్రులను గౌరవించలేదని ఆమె విమర్శించారు.
మరోవైపు కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగాలని సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ, పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు సిద్ధూ ఉవ్విళ్లూరుతున్నారు. అయితే ఎవరిని ఎంపిక చేయాలో అన్నది కాంగ్రెస్ అధిష్ఠానం తేల్చలేకపోతున్నది. ఈ ఎంపికను ఇప్పటికే రెండు సార్లు వాయిదా వేసింది. అయితే ఫిబ్రవరి 6న సీఎం అభ్యర్థిని కాంగ్రెస్ ప్రకటిస్తుందని సీఎం చన్నీ తెలిపారు. ఆ రోజు తాను కూడా రాహుల్ గాంధీతో ఉంటానని చెప్పారు.