న్యూఢిల్లీ: పంజాబ్కు చెందిన కాంగ్రెస్ నేత నవజోత్ సింగ్ సిద్ధూ శుక్రవారం ఢిల్లీలోని కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ నివాసానికి వెళ్లి ఆమెతోపాటు రాహుల్ గాంధీని కలిశారు. పార్టీ ప్రధాన కార్యదర్శి, పంజాబ్ ఇన్చార్జి హరీష్ రావత్ కూడా సిద్ధూ వెంట ఉన్నారు. ఈ నేపథ్యంలో పంజాబ్ కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా సిద్ధూతో పాటు మరో ఇద్దరిని కార్యనిర్వాహక అధ్యక్షులుగా పార్టీ నియమించవచ్చని తెలుస్తున్నది. ప్రస్తుత పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ సునీల్ జఖర్కు ఏఐసీసీలో పదవి ఇవ్వవచ్చని సమాచారం.
పంజాబ్ కాంగ్రెస్లో అంతర్గత పోరు తీవ్ర స్థాయికి చేరింది. సిద్ధూ గత కొన్ని నెలలుగా సీఎం అమరీందర్ సింగ్కు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య సయోధ్య కుదిర్చి సమస్యను పరిష్కరించేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం ఇటీవల ముగ్గురు సభ్యులతో కమిటీని నియమించింది. ఆ కమిటీ సిఫార్సు మేరకు సిద్ధూను పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ను చేయాలని పార్టీ నిర్ణయించింది. అయితే ఈ ప్రతిపాదనను సీఎం అమరీందర్ సింగ్ తొలి నుంచి వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం సీఎం అమరీందర్, సిద్ధూ తమ మద్దతు ఎమ్మెల్యేలు, ఎంపీలతో వేర్వేరుగా సమావేశమయ్యారు.