చండీగఢ్, జూలై 16: కనీస మద్దతు ధరకు (ఎమ్మెస్పీ) చట్టబద్ధ హామీ ఇస్తామని వాగ్ధానం చేసి, ఆ తర్వాత దాని ఊసే ఎత్తని కేంద్రప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. ‘విశ్వాసఘాత్ సమ్మేళన్’ పేరిట ఈ నెల 31న దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చాయి. ఆ రోజు రోడ్ల దిగ్బంధనం చేస్తామని వెల్లడించాయి. సాగుచట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించిన సమయంలో ఎమ్మెస్పీకి చట్టబద్ధమైన హామీ కల్పిస్తామని, ఇందుకు గానూ కమిటీని ఏర్పాటు చేస్తామని కేంద్రం రాతపూర్వక హామీ ఇచ్చిందని రైతు నేతలు గుర్తుచేశారు. అయితే, ఇప్పుడు మాటమార్చి కేంద్రం నమ్మకద్రోహానికి పాల్పడుతున్నట్టు ధ్వజమెత్తారు. సోమవారం ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఎమ్మెస్పీకి చట్టబద్ధత కల్పించే బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.
సమిష్టి విజయాలు
కడుపుమండిన రైతన్నలు ఒకచోటకు చేరి సమిష్టిగా ఆందోళనలు చేపడితే ఫలితం ఎలా ఉంటుందో సాగుచట్టాల రద్దు ఘటన రుజువు చేసింది. ఇప్పుడు ఈ స్ఫూర్తిని అలాగే కొనసాగించడంలో హర్యానా రైతులు ముందున్నారు. గత ఏడాది వానల కారణంగా నష్టపోయిన పంటలకు పరిహారం చెల్లించాలంటూ హిసార్ జిల్లాలోని బల్సామండ్ గ్రామంలో గత రెండు నెలలుగా స్థానిక రైతులు నిరసన చేపడుతున్నారు. వీరికి సంయుక్త కిసాన్ సంఘర్ష్ సమితి, భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) రైతు ప్రతినిధులు జతచేరారు. ఆందోళనలు ఉద్ధృతం కావడంతో అధికారులు దిగొచ్చారు. పరిహారాన్ని వారంలోపు బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని హామీ ఇచ్చారు. పరిహారం ఇవ్వకుండానే తమ పంట పొలాల్లో హైటెన్షన్ ఎలక్ట్రిసిటీ టవర్లను ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ బంద్రాలా గ్రామంలో రైతులు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. వివిధ రైతు సంఘాలు వారికి మద్దతు ప్రకటించాయి. దీంతో పరిహారం చెల్లిస్తామని అధికారులు ప్రకటించారు. రైతుల సమాఖ్య నిరసనలపై బీకేయూ నేత రాకేశ్ బైన్స్ స్పందించారు. సాగుచట్టాలపై విజయం సాధించడం రైతుల్లో ఆత్మైస్థెర్యాన్ని పెంచిందన్నారు. ఏ సమస్య వచ్చినా.. సమిష్టిగా ఎదుర్కొని ఫలితాన్ని సాధించవచ్చన్న ధీమా వాళ్లలో పెరిగినట్టు వెల్లడించారు.