బెంగళూరు: బీజేపీ పాలిత కర్ణాటకలో దారుణం జరిగింది. మాజీ ఇంటెలిజెన్స్ అధికారిని కారుతో ఢీకొట్టి హత్య చేశారు. సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 82 ఏళ్ల మాజీ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) అధికారి ఆర్కే కులకర్ణి శుక్రవారం సాయంత్రం మైసూరు విశ్వవిద్యాలయంలోని మానసగంగోత్రి క్యాంపస్లో ఈవినింగ్ వాక్ చేస్తున్నారు. ఇంతలో వేగంగా వచ్చిన ఒక కారు ఆయన మీదకు దూసుకెళ్లి ఢీకొట్టి వెళ్లిపోయింది. తీవ్రంగా గాయపడిన ఆయన మరణించారు.
కాగా, ఈ సమాచారం అందుకున్న పోలీసులు, కులకర్ణి రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లు తొలుత భావించారు. అయితే ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించగా అసలు విషయం తెలిసింది. ఎవరో ఉద్దేశపూర్వకంగా ఆయనను కారుతో ఢీకొట్టినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ముప్పై ఏళ్లు ఐబీలో పనిచేసిన కులకర్ణి 23 ఏళ్ల కిందట పదవీ విరమణ చేసినట్లు పోలీసులు తెలిపారు. కులకర్ణి రోజూ సాయంత్రం వేళ నడిచే ఆ దోవలో కార్లు వంటి వాహనాలు వెళ్లవని చెప్పారు. దీంతో ఎవరో ఉద్దేశపూర్వకంగా ఆయనను కారుతో ఢీకొట్టి హత్య చేశారని వెల్లడించారు.
కాగా, ఆ కారుకు నంబర్ ప్లేట్లు లేవని, అయితే తమకు కొన్ని ఆధారాలు లభించాయని పోలీస్ అధికారి వివరించారు. మరింత దర్యాప్తు కోసం పోలీస్ బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మరోవైపు ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Murder of 82-Yr-Old IB Officer RK Kulkarni In Mysuru Caught On Video#Karnataka #IBOfficer #RKKulkarni #Mysuru pic.twitter.com/dE10xBeYlE
— India.com (@indiacom) November 6, 2022