ముంబై: బలవంతపు వసూళ్ల కేసులో ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరంబీర్ సింగ్పై చార్జిషీట్ దాఖలైంది. బలవంతపు వసూళ్ల కేసుకు సంబంధించి ముంబై క్రైమ్ బ్రాంచ్కు చెందిన 11వ యూనిట్ పోలీసులు ఎస్ప్లానడే కోర్టులో శనివారం 400 పేజీల చార్జిషీట్ దాఖలు చేశారు. ఆ చార్జిషీట్లో పరంబీర్ సింగ్తోపాటు సచిన్ వాజే, అల్పేష్ పటేల్, సుమిత్ సింగ్లపై అభియోగాలు నమోదయ్యాయి.
ఈ ఏడాది జూలై 23న పరంబీర్సింగ్, సచిన్ వాజేతోపాటు మరో ఇద్దరిపైన గోరెగావ్ పోలీస్స్టేషన్లో బలవంతపు వసూళ్ల కేసు నమోదైంది. ఆ తర్వాత కేసు దర్యాప్తు బాధ్యతలను ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు అప్పగించారు. మహారాష్ట్ర మాజీ హోంమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నేత అనిల్ దేశ్ముఖ్పై అవినీతి, బలవంతపు వసూళ్ల ఆరోపణలు చేస్తూ గత మార్చిలో పరంబీర్ సింగ్.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేకు లేఖ రాశారు. దాంతో ఆయనపై మొత్తం ఆరు కేసులు నమోదుచేశారు.
మార్చి 17న 1998 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన పరంబీర్ సింగ్ను మహారాష్ట్ర ప్రభుత్వం ముంబై పోలీస్ కమిషనర్ పదవి నుంచి తొలగించింది. అనంతరం మహారాష్ట్ర స్టేట్ హోంగార్డ్స్కు జనరల్ కమాండర్గా పంపింంది. దాంతో ఆయన లాంగ్ లీవ్ పెట్టి అజ్ఞాతంలోకి వెళ్లారు. దాంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కారం నేరం కింద నాన్బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. కానీ, పరంబీర్ సింగ్ తనకు తానుగా కోర్టు ముందు హాజరుకావడంతో నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ను రద్దు చేసింది.