ముంబై: ఒక వ్యక్తి 15 ఏళ్లుగా పరారీలో ఉన్నాడు. పేరు మార్చుకుని పోలీసుల కళ్లగప్పి తిరుగుతున్నాడు. అయితే అతడి నోట్లోని బంగారం పూత పళ్లు పోలీసులకు పట్టిచ్చాయి. మహారాష్ట్ర రాజధాని ముంబైకి చెందిన 38 ఏళ్ల ప్రవీణ్ 2017లో ఒక దుస్తుల షాపులో సేల్స్మ్యాన్గా పని చేశాడు. ఒక రోజు మరో బట్టల వ్యాపారి నుంచి రూ.40,000 వసూలు చేయాలని యజమాని అతడికి చెప్పాడు. అయితే ఆ డబ్బులు కలెక్ట్ చేసిన ప్రవీణ్, ఆ బ్యాగ్ను ఎవరో దొంగిలించినట్లు యజమానికి తెలిపాడు. ఆయన దీనిపై ఫిర్యాదు చేయడంతో ప్రవీణ్ వద్ద ఆ డబ్బులు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. అతడ్ని అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం జైలుకు పంపారు.
కాగా, కొన్ని నెలల తర్వాత బెయిల్పై ప్రవీణ్ విడుదలయ్యాడు. ఆ తర్వాత ముంబైని వీడి గుజరాత్లోని కచ్ జిల్లాకు పారిపోయాడు. మాండ్విలోని సబ్రాయ్ గ్రామంలో 15 ఏళ్లుగా ఉంటున్నాడు. తన పేరును ప్రవీణ్ అశుభ జడేజా, ప్రవీణ్ సింగ్, ప్రదీప్ సింగ్ అశుభ జడేజాగా మార్చుకున్నాడు. అక్కడ ఎల్ఐసీ ఏజెంట్గా అతడు పని చేస్తున్నాడు.
మరోవైపు ప్రవీణ్పై నమోదైన కేసుపై ముంబై పోలీసులు తిరిగి దృష్టిసారించారు. బెయిల్పై విడుదలై పరారీలో ఉన్న అతడి కోసం వెతికారు. ప్రవీణ్ గుజరాత్లో ఉన్నట్లు అతడి పాత స్నేహితుల ద్వారా తెలుసుకున్నారు. దీంతో పోలీసులు కూడా ఎల్ఐసీ ఏజెంట్లగా నటించారు. ఒక సమావేశం కోసం అతడ్ని ముంబైకి రప్పించారు. ప్రవీణ్ నోటిలోని బంగారం పూత పళ్ల ద్వారా అతడ్ని గుర్తించి అరెస్ట్ చేశారు.