ముంబై : మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఎంపీఎస్సీ) గత మార్చి నెలలో నిర్వహించిన డ్రగ్ ఇన్స్పెక్టర్ గ్రూప్-బి రిక్రూట్మెంట్ పరీక్ష పత్రాన్ని ఒక్కో అభ్యర్థికి రూ. 40 లక్షల చొప్పున విక్రయించారని ఎన్సీపీ(శరద్ పవార్ వర్గం) ఎమ్మెల్యే రోహిత్ పవార్ బుధవారం ఆరోపించారు. దీనిపై విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. దోషులకుగా తేలిన వారిపై సమగ్ర దర్యాప్తు జరిపి, కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ హామీ ఇచ్చినట్లు బీజేపీకి చెందిన నేత ఒకరు మీడియాకు తెలిపారు. స్క్రీనింగ్ పరీక్షలో జరిగినట్లుగా చెబుతున్న అక్రమాలపై ప్రాథమిక విచారణ అనంతరం ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ విభాగం పరిధిలోని డ్రగ్ ఇన్స్పెక్టర్ గ్రూప్-బి పోస్టుల రిక్రూట్మెంట్ ప్రక్రియను ఎంపీఎస్సీ రద్దు చేసింది.
పరీక్షకు ముందే ఒక అభ్యర్థి ప్రశ్న పత్రాల సెట్ను పొంది, లబ్ధి పొందినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని కమిషన్ పేర్కొంది. కాగా రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న ఏజెంట్ల ద్వారా ఒక్కో పేపర్ రూ. 40 లక్షలకు విక్రయించినట్లు తనకు సమాచారం అందిందని ఎన్సీపీ(ఎస్పీ) ఎమ్మెల్యే రోహిత్ పవార్ ఆరోపించారు. కమిషన్ చైర్మన్ దీనిక నైతిక బాధ్యత వహిస్తూ తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ పోస్టులకు కొత్తగా తిరిగి పరీక్ష నిర్వహించాలని కమిషన్ నిర్ణయించింది. దీంతో స్క్రీనింగ్ పరీక్షలో ఉత్తీర్ణులై, ఆ తర్వాత ఇంటర్వ్యూలకు హాజరైన అభ్యర్థులు సైతం కొత్తగా నిర్వహించే పరీక్షను రాయాల్సి ఉంటుంది. ఈ ఏడాది మార్చి 22న మహారాష్ట్ర వ్యాప్తంగా ఆరు డివిజనల్ ప్రధాన కేంద్రాల్లో స్క్రీనింగ్ పరీక్షను ఆఫ్లైన్ పద్ధతిలో నిర్వహించారు. ఈ పరీక్ష ఫలితాలు జూన్ 12న విడుదల కాగా, 506 మంది ఇంటర్వ్యూ దశకు అర్హత సాధించారు. వీరిలో 488 మంది ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. వీరిలో 485 మంది అర్హులుగా తేలగా, ముగ్గురిని అనర్హులుగా కమిషన్ ప్రకటించింది.