న్యూఢిల్లీ, ఆగస్టు 26: రక్షణ రంగ ఉత్పత్తుల తయారీకి ప్రైవేట్ సంస్థలకు మోదీ ప్రభుత్వం తలుపులు బార్లా తెరిచింది. డీఆర్డీవో సాంకేతికతలను ఉపయోగించి సంప్రదాయ క్షిపణి రంగంలోకి భారతీయ ప్రైవేట్ రంగాన్ని అనుమతిస్తూ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నిర్ణయం తీసుయకున్న మరునాడే 1000-1500 కి.మీ పరిధి కలిగిన ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిస్సైల్, 150-500 కి.మీ పరిధి కలిగిన ప్రళయ్ క్వాసీ-బాలిస్టిక్ టాక్టికల్ మిస్సైల్ తయారీ కోసం ప్రైవేట్ సంస్థలను మోదీ ప్రభుత్వం గుర్తించడం ప్రారంభించింది.
క్షిపణుల తయారీకి ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సాహం ఇవ్వాలని భావిస్తున్నది. ఇది ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యం వైపు తీసుకువెళ్లడమే కాక, భారతదేశ సైనిక-పారిశ్రామిక వ్యవస్థను విస్తృతం చేస్తుందని రక్షణ శాఖ అంటున్నది. కాగా, క్షిపణులలో అనుసంధానం కోసం దాదాపు 50 ఉప వ్యవస్థలను ప్రైవేట్ రంగం ఇప్పటికే సరఫరా చేస్తున్నది.
గాలి నుంచి గాలిలోకి ప్రయోగించే ఆస్ట్రా మార్క్ (110 కి.మీ పరిధి), మార్క్ 2 (150 కి.మీ పరిధి) సుదీర్ఘ లక్ష్య భూమి దాడి క్రూయిజ్ క్షిపణులను ఇకపై భారత్లోని ప్రైవేట్ సంస్థలు డీఆర్డీవో నుంచి బదిలీ అయ్యే సాంకేతిక పరిజ్ఞానం ద్వారా తయారు చేస్తాయి. దీని కోసం ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. హైదరాబాద్లోని ఐసీఓఎంఎం, భారత్ ఫోర్జ్, అదానీ డిఫెన్స్ సిస్టమ్స్ అండ్ టెక్నాలజీస్ (ఏడీఎస్టీఎల్), భారత్ డైనమిక్స్ లిమిటెడ్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లో ఈ దిగువ క్షిపణులు, ఆయుధాలను తయారు చేయనున్నాయి.